Billionaires 2021: అదానీ సంపద రూ.3.10 లక్షల కోట్లు జంప్
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 2021లో అత్యధిక సంపద ఆర్జించిన వ్యక్తిగా నిలిచారు. 2021లో ఆయన ఆస్తి 41.5 బిలియన్ డాలర్లు పెరిగి 75.3 బిలియన్ లర్లకు చేరుకుంది. మన కరెన్సీలో ఇది రూ.3,10,000 కోట్లు పెరిగి రూ.5,60,000 కోట్లకు చేరుకుంది. అదానీ కంపెనీల షేర్లు అనూహ్యంగా పెరగడం ఇందుకు దోహదపడింది. ఏడాది కాలంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 245 శాతం వృద్ధి చెందింది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కంటే 2021లో అదానీ ఆర్జించింది ఎక్కువ.
అదానీ గ్రూప్లోని అదానీ ట్రాన్స్మిషన్ 288 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 351 శాతం పుంజుకున్నాయి. 2021లో ముఖేష్ సంపద 13 బిలియన్ డాలర్లు పెరిగి 89.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2021లో రిలయన్స్ షేర్లు 18.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. ప్రామాణిక ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ కంటే రిలయన్స్ షేర్లు తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. గత ఏడేళ్లలో సెన్సెక్స్, నిఫ్టీ కంటే రిలయన్స్ తక్కువ రిటర్న్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి. సెన్సెక్స్ దాదాపు 22 శాతం, నిఫ్టీ 24 శాతం వరకు లాభపడ్డాయి. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ కూడా అంబానీ కంటే అధిక సంపద సృష్టించారు.
ఏడాది కాలంలో అజీమ్ ప్రేమ్జీ నెట్ వర్త్ 15.8 బిలియన్ డాలర్లు పెరిగి 41.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. విప్రో షేర్లు 84 శాతం పుంజుకున్నాయి. డీమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ ధమానీ సంపద 9.51 బిలియన్ డాలర్లు పెరిగి 24.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు 66 శాతం జంప్ చేశాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 39 శాతం రాణించాయి. దీంతో శివ్ నాడర్ సంపద 8.4 బిలియన్ డాలర్లు పెరిగింది.