Natural Gas: ప్రతినెల ప్రారంభంలో గ్యాస్ ధరలను చమురు కంపెనీలు నిర్ణయిస్తుంటాయి. అయితే ఇవి కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల ధరలు ఎలా ఉంటాయో ముందుగానే నిర్ణయిస్తారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం CNG-PNG ధరలను నిర్ణయించేందుకు కొత్త ఫార్ములాను తీసుకొచ్చింది.
అయితే తాజా క్యాబినెట్ నిర్ణయం ప్రకారం నగరాల్లో పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే నేచురల్ గ్యాస్, వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించే సీఎన్జీ ధరలకు గరిష్ఠ ధరలను నిర్ణయించింది. దీని ద్వారా గ్యాస్ సరఫరా సంస్థలు తమకు నచ్చినట్లుగా, కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ ధరలకు అమ్మటం కుదరదు. ఈ క్రమంలో కిరిట్ పారిఖ్ ప్యానెల్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది.

ధరల లెక్కింపులో కేంద్రం తెస్తున్న కొత్త సూత్రం వినియోగదారులకు ధరల విషయంలో పెద్ద ఊరటను అందించనుంది. గృహాల్లో వినియోగించే పీఎన్జీ ధర పూనేలో రూ.92గా ఉండగా.. అది రూ.87కి తగ్గనుంది. ముంబైలో రూ.87గా ఉన్న ధర రూ.79కి తగ్గుతుంది. ఇక బెంగళూరు మహానగరంలో ధర రూ.89.5 నుంచి రూ.83.5కి తగ్గబోతోంది. అంటే కేజీ గ్యాస్ ధర రూ.5 నుంచి రూ.9 వరకు తగ్గుతుందని తెలుస్తోంది. వాహనాల్లో వినియోగించే సీఎన్జీ విషయంలోనూ రూ.5 వరకు తగ్గింపు కనిపించనుంది.
ఇకపై దేశీయ గ్యాస్ ధరలను దిగుమతి చేసుకున్న క్రూడ్ ధరలతో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత క్రూడ్ బాస్కెట్లో 10 శాతంగా నిర్ణయించబడుతుందని, నెలవారీ ప్రాతిపదికన సవరించబడుతుంది. కిరిట్ పారిఖ్ ప్యానెల్ సిఫార్సులను ఆమోదించడం వల్ల ప్రయోజనం పూర్తిగా అందితే.. CNG, PNG కస్టమర్ల ధరలు 10 నుంచి 12 శాతం వరకు తగ్గుతాయని పరిశ్రమ విశ్లేషకులు ఇంతకు ముందే వెల్లడించారు.


Click it and Unblock the Notifications