భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ.. మరో హైదరాబాద్ కానున్న ఉత్తరాంధ్ర.. ఆగస్టు 1న ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్ పోర్టు ప్రారంభం కానుంది.ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది.
2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అడుగులు పడిన ఈ ప్రాజెక్టును.. ప్రస్తుత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పూర్తి చేసింది. ఈ విమానాశ్రయం కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా.. ఉత్తరాంధ్ర సామాజిక-ఆర్థిక చిత్రపటాన్ని సమూలంగా మార్చివేసి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం ఆర్థిక రంగానికి ఈ విమానాశ్రయం వెన్నెముకగా మారనుంది. గతంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల స్వరూపం ఏ విధంగానైతే మారిపోయిందో, Bhogapuram International Airport కూడా ఉత్తరాంధ్రకు అదే స్థాయి పరివర్తనను (Transformation) తీసుకొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ లభించడం వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకరంగం కొత్త పుంతలు తొక్కడమే కాకుండా, భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వచ్చేందుకు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అయ్యేందుకు ఇది ఒక ప్రధాన వనరుగా పనిచేయనుంది.
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భోగపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి రావడం ద్వారా సామాన్య ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు రావడంతో పాటు ప్రాంతీయ సమాన అభివృద్ధికి పెద్దపీట వేసినట్లవుతుంది.
దీని రాకతో విమానాశ్రయంతో పాటు విమానయాన అనుబంధ రంగాలు (Aerotropolis) అభివృద్ధి చెందనున్నాయి. కార్గో (సరకు రవాణా) సౌకర్యాలు మెరుగుపడటం వల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఫార్మా, ఆక్వా, ఐటీ, విడిభాగాల తయారీ రంగాలు విదేశీ మార్కెట్లతో నేరుగా అనుసంధానమవుతాయి. దీనివల్ల స్థానికంగా వేలాదిమంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
అరకు, లంబసింగి, విశాఖ తీరప్రాంతాలు, ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు అంతర్జాతీయ పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు నేరుగా అందుబాటులోకి రావడంతో హోటల్, హాస్పిటాలిటీ రంగాలు వేగంగా విస్తరిస్తాయి. భోగపురం ఎయిర్పోర్టును ప్రధాన నగరమైన విశాఖపట్నంతో వేగంగా అనుసంధానించేందుకు రహదారుల విస్తరణ, నేషనల్ హైవే కనెక్టివిటీ, ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్టులు వేగవంతం కానున్నాయి. ఇది ఈ ప్రాంత రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి భారీ ఊతాన్ని ఇస్తుంది.ఏదేమైనా భోగపురం విమానాశ్రయం కేవలం ఒక రవాణా కేంద్రంగానే కాకుండా, ఉత్తరాంధ్రను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా తీర్చిదిద్దడంలో అత్యంత కీలక పాత్ర పోషించనుంది.


Click it and Unblock the Notifications
