భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతలు ఇవే.. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతులు మీదుగా ప్రారంభం..
ఉత్తరాంధ్ర రూపురేఖలను సమూలంగా మార్చివేయబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చేందుకు రెడీ అయింది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద రూ. 4,727 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు.
నిర్ణీత గడువు కంటే దాదాపు ఐదు నెలల ముందే.. కేవలం 31 నెలల రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుని దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలలో ఒకటిగా ఇది చరిత్రకెక్కింది. ఈ విమానాశ్రయానికి ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుండి ఏరోడ్రోమ్ లైసెన్స్తో పాటు అవసరమైన భద్రతా, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులు లభించడంతో వాణిజ్య విమాన కార్యకలాపాలకు ఇది పూర్తిగా సిద్ధమైంది.

Photo Credit: PTI
జిఎమ్ఆర్ (GMR) విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ పిపిపి (PPP) విధానంలో.. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్ మొత్తం 2,703.26 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది. ఇందులో విమానాశ్రయానికి 2,203 ఎకరాలు కేటాయించగా, మిగిలిన భూమిని ఏవియేషన్ హబ్, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాల కోసం కేటాయించారు. తొలి దశలో ఏటా 60 లక్షల (6 మిలియన్ల) మంది ప్రయాణికులకు సేవలు అందించేలా దీనిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల సంఖ్యను 4 కోట్లకు (40 మిలియన్లకు) పెంచేందుకు వీలుగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశారు.
ఈ విమానాశ్రయానికి ప్రధాన ఆకర్షణగా 3,800 మీటర్ల సుదీర్ఘమైన కోడ్-ఈ రన్వే నిలిచింది. ఈ అధునాతన రన్వే సాయంతో బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్లైనర్, ఎయిర్బస్ A330 వంటి అతిపెద్ద అంతర్జాతీయ విమానాలు కూడా ఇక్కడ సునాయసంగా ల్యాండ్ కావచ్చు. విమానాశ్రయం యొక్క అంతర్గత, బాహ్య వినూత్న డిజైన్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
బంగాళాఖాత సముద్ర వారసత్వానికి ప్రతీకగా ఎగిరే చేప ఆకారంలో టెర్మినల్ ఆర్కిటెక్చర్ నిర్మించగా.. సీలింగ్, పైకప్పులపై తెలుగు సాంప్రదాయ రంగుల ముగ్గుల (రంగవల్లుల) నమూనాలు ప్రతిబింబిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ లీడ్ (LEED) ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో దీనిని నిర్మించారు. ఇందులోని నీటి అవసరాలలో 30 శాతాన్ని పునర్వినియోగ నీటి ద్వారానే తీర్చుకోవడం విశేషం.
విశాఖపట్నం పోర్ట్, సమీప పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించబడిన ఈ విమానాశ్రయంలో ఏటా 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల అధునాతన కార్గో టెర్మినల్ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉష్ణోగ్రత-నియంత్రిత కోల్డ్ చైన్ వ్యవస్థలు ఉండటం వల్ల ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల నుండి ఫార్మా ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు, వ్యవసాయ ఉత్పత్తుల వేగవంతమైన అంతర్జాతీయ ఎగుమతులకు మార్గం సుగమమైంది.
రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,583 కోట్ల నిధులతో అనుసంధాన రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. విమానాశ్రయాన్ని ఆనుకుని 500 ఎకరాలలో నిర్మించనున్న 'నెట్-జీరో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్' ద్వారా రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి.. సుమారు 60 వేల ప్రత్యక్ష, 1.2 లక్షల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
అంతేకాకుండా, 136 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఏవియేషన్ యూనివర్సిటీ ద్వారా ఏటా 9 వేల మంది విద్యార్థులకు ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ అంశాల్లో శిక్షణ లభిస్తుంది. ఫలితంగా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పర్యాటక, రవాణా, పారిశ్రామిక రంగాలు ఊపందుకుని ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారనుంది.


Click it and Unblock the Notifications
