జియోకు ఎయిర్టెల్ షాక్! వొడాఫోన్ ఐడియా అంతకంతకూ డౌన్
టెలికం మేజర్ భారతీ ఎయిర్టెల్ వరుసగా ఆరో నెల సబ్స్క్రైబర్లను జోడించుకోవడంలో ప్రథమ స్థానంలో నిలిచింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ప్రకారం జనవరి నెలలో కూడా ఎయిర్టెల్కు ఎక్కువమంది సబ్స్క్రైబర్లు జత కలిశారు. ఎయిర్టెల్, జియోకు ఎక్కువమంది చందాదారులు జత కలవగా, వొడాఫోన్ ఐడియా నుండి చాలామంది బయటకు వెళ్లిపోయారు. ఇప్పటికీ జియో టాప్ టెలికం ఆపరేటర్గా ఉంది. రెండో స్థానంలో ఎయిర్ టెల్, మూడో స్థానంలో వొడాఫోన్ ఐడియా ఉంది.
చైనాలో గూఢచర్యం.. టెస్లాను మూసివేస్తామన్న ఎలాన్ మస్క్
ఏ టెల్కోకు ఎంతమంది సబ్స్క్రైబర్లు అంటే
నెల ప్రాతిపదికన జనవరి నెలలో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లు 1.2 శాతం పెరిగారు. ఎయిర్టెల్కు 5.89 మిలియన్ల మంది కొత్తగా చేరగా, జియో కొత్త సబ్స్క్రైబర్లు 1.9 మిలియన్లుగా ఉన్నారు. నెల ప్రాతిపదికన జియో సబ్స్క్రైబర్ల వృద్ధి 0.4 శాతంగా ఉంది. వొడాఫోన్ ఐడియా నుండి 1.7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు బయటకు పోయారు. 410.7 మిలియన్ల సబ్స్క్రైబర్లతో జియో మొదటి స్థానంలో, 344.6 మిలియన్ల సబ్స్క్రైబర్లతో ఎయిర్టెల్ రెండో స్థానంలో, 285.9 సబ్స్క్రైబర్లతో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది.
మార్కెట్ వాటాలో జియో ఫస్ట్
వైర్లెస్ మార్కెట్ షేర్లో రిలయన్స్ జియో వాటా 35.3 శాతంగా ఉంది. ఆ తర్వాత ఎయిర్టల్ వాటా 29.62 శాతంగా, వొడాఫోన్ ఐడియా 24.58 శాతంగా ఉంది. గత ఏడాది జూన్ నుండి జనవరి 2021 మధ్య ఎక్కువ నెలలు జియో కంటే ఎయిర్టెల్ ఎక్కువమంది సబ్స్క్రైబర్లను జత కలుపుకుంది. జూన్ నెలలో 34.8 శాతంగా ఉన్న జియో మార్కెట్ వాటా ఈ కాలంలో స్వల్పంగా పెరిగి 35.3 శాతానికి చేరుకుంది. వొడాఫోన్ ఐడియా వాటా 26.75 శాతం నుండి 2 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది.
వైర్ లైన్ మార్కెట్ షేర్
వైర్ లైన్ మార్కెట్లో రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. 2020 జూన్ నెలలో 7.3 శాతంగా ఉండగా, జనవరి 2021 నాటికి 14.7 శాతానికి పెరిగింది. ప్రధానంగా బీఎస్ఎన్ఎల్ నుండి జియో లబ్ధి పొందింది. బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు జియో వైపు మరలారు. జూన్ 2020లో బీఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్ 41 శాతం కాగా, 2021 జనవరికి 34 శాతానికి పడిపోయింది.