BharatPe: భారత్పే అష్నీర్ గ్రోవర్ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ఫిన్టెక్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కి చేదు అనుభవం ఎదురైంది.
అష్నీర్ గ్రోవర్ అతని భార్య మాధురీ జైన్ దేశం విడిచి వెళ్ళకుండా నిరోధించబడ్డారు. ఈ ఇద్దరిపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ జంట గురువారం న్యూయార్క్కు బయలుదేరుతుండగా.. దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై గ్రోవర్ ఒక ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తనకు ఎఫ్ఐఆర్ గురించిన సమాచారం లేదని అందులో పేర్కొన్నారు.

దిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం(EOW) అభ్యర్థన మేరకు.. అష్నీర్ గ్రోవర్, మాధురీ జైన్పై లుక్ అవుట్ నోటీసు జారీ చేయబడింది. జూన్ నెల ప్రారంభంలో డబ్బు దుర్వినియోగం చేసినందుకు, BharatPeని నడుపుతున్న రెసిలెంట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.81 కోట్ల నష్టం కలిగించినందుకు దంపతులపై, మరికొందరు కుటుంబ సభ్యులపై EOW FIR నమోదు చేసింది. గ్రోవర్ కుటుంబానికి అనుబంధంగా ఉన్న ఎనిమిది హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థలు - ట్రూ వర్క్ కంపెనీ, టీమ్ సోర్స్ అండ్ ఇంపల్స్ మార్కెటింగ్ - ఇన్వాయిస్లను ఫోర్జరీ చేసే అవకాశం ఉందని సూచిస్తూ క్లోజ్డ్ బ్యాంక్ ఖాతాలతో బిల్లులు దాఖలు చేశాయి. ఈ కంపెనీలన్నీ ఒకే రిజస్టర్డ్ ఆఫీసు చిరునామా కలిగి ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది.
అష్నీర్ గ్రోవర్ ఒక ట్వీట్లో ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ అగర్వాల్పై మండిపడ్డారు. మొదటి నుంచి పెద్ద వ్యాపారాన్ని నిర్మించడం చాలా కష్టమైన విషయమని..వ్యాపారాన్ని వారసత్వంగా పొందడం, అదే స్థాయిలో నిర్వహించడం ఇప్పటికీ కష్టమని అందులో పేర్కొన్నారు. SBI మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ భారత్ పే డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్గా ఉన్నారు.


Click it and Unblock the Notifications