Airtel: ఎయిర్టెల్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. గూగుల్తో టెలికాం దిగ్గజం మెగా డీల్.. పూర్తి వివరాలు..
Airtel-Google Deal: దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్.. గూగుల్ సంస్థ మధ్య అతిపెద్ద డీల్ కుదిరింది. ఇందులో భాగంగా.. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కు ఈక్విటీ షేర్లను కేటాయించాలని భారతీ ఎయిర్ టెల్ నిర్ణయించింది. ఎయిర్టెల్ ఒక్కో షేరు రూ.734 ధర చొప్పున 7.1 కోట్ల ఈక్విటీ షేర్లను గూగుల్కు కేటాయించనుంది. ఎయిర్టెల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన సమాచారంలో ఈ వివరాలను వెల్లడించింది. ఎయిర్టెల్ కంపెనీలో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలన్న గూగుల్ నిబద్ధతకు అనుగుణంగా షేర్ల కేటాయింపు జరిగిందని కంపెనీ వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు రూ.5,224 కోట్లని కంపెనీ తెలిపింది.
"జూలై 14న జరిగిన కంపెనీ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్పై డైరెక్టర్ల ప్రత్యేక కమిటీ గూగుల్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్సీకి షేర్ల కేటాయింపును ఆమోదించింది. మొత్తం 7,11,76,839 ఈక్విటీ షేర్ల కేటాయింపుకు కోసం ఆమోదించబడ్డాయి. రూ.5 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేరుకు రూ.734 ఇష్యూ ధరతో కేటాయించబడతాయి" అని ఎయిర్టెల్ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం వెలువడటంతో ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచి ఎయిర్ టెల్ స్టాక్ భారీగా లాభపడింది. ఉదయం 10.45 గంటలకు స్టాక్ 1.61 శాతం లాభపడి రూ.652 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది గురువారం ముగింపు ధర అయిన రూ.642 కంటే రూ.10 అధికం. ఈ డీల్ కారణంగా.. రానున్న రోజుల్లో కంపెనీ మరింత లాభాలతో తన ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.