బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్.. ఈ రెండు ప్రధాన కారిడార్లలో వెళ్లే ప్రయాణికులుకు బిగ్ అలర్ట్..
ఐటీ రాజధాని బెంగళూరులో నిరంతరం పెరిగిపోతున్న వాహన రద్దీని అదుపు చేయడానికి, రహదారి ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించిన ఆంక్షల వ్యూహంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నగరంలోని ప్రధాన ఎలివేటెడ్ కారిడార్లపై ఒకేసారి విధించిన నిబంధనల వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడటంతో, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రెండు ప్రధాన కారిడార్లలో దశలవారీగా ఈ ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించారు.
గతవారం బిజిఎస్ (BGS) ఫ్లైఓవర్, పీణ్య ఫ్లైఓవర్, సిల్క్ బోర్డ్-రాగిగుడ్డ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లతో పాటు మిగిలిన కారిడార్లపై ప్రయోగాత్మకంగా అమలు చేసిన నిబంధనలు కొంతవరకు సత్ఫలితాలనిచ్చాయి. అక్కడ వాహనాల ప్రవాహం సాధారణ స్థితిలోనే ఉందని అధికారులు గుర్తించారు. అయితే అంతర్జాతీయ విమానాశ్రయ రహదారి (ఎయిర్పోర్ట్ రోడ్) ఎలివేటెడ్ కారిడార్ వద్ద పరిస్థితి వికటించింది.

సంజీవ్ నగర్ క్రాస్ నుండి విద్యాశిల్ప జంక్షన్ వరకు విస్తరించి ఉన్న ఎయిర్పోర్ట్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్ వద్ద ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలు, సరుకు రవాణా (గూడ్స్) వాహనాలను ఒకేసారి ర్యాంపుల వద్ద దారి మళ్లించారు. దీంతో అప్రోచ్ రోడ్లలో వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడటమే కాకుండా, కిందిభాగంలోని సర్వీసు రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ ఒత్తిడి పెరిగింది. ప్రయాణికుల నుంచి వ్యక్తమైన ఆగ్రహం, అలాగే డేటాను విశ్లేషించిన పిమ్మట Bengaluru పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
కొత్త అమలు విధానం ప్రకారం:
సరుకు రవాణా వాహనాలకు మాత్రమే ఆంక్షలు: ప్రణాళికలోని మొదటి దశలో కేవలం భారీ, మీడియం గూడ్స్ వాహనాలపై మాత్రమే నిర్దేశిత సమయాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు విసులుబాటు: ప్రస్తుతానికి బైక్లు, ఆటోలు ఎలివేటెడ్ కారిడార్పై వెళ్లేందుకు నిబంధనలను సడలించారు.
వేగ పరిమితి & లేన్ క్రమశిక్షణ: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఎడమ లేన్లోనే ప్రయాణించాలని, గరిష్ట వేగ పరిమితి గంటకు 60 కిలోమీటర్లు దాటకూడదని, ప్రమాదకరమైన ఓవర్టేకింగ్లు చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.
సెప్టెంబర్ 11 నుంచి ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ నిబంధనలు
మరోవైపు ఐటీ కారిడార్గా ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రానిక్ సిటీ ఎలివేటెడ్ కారిడార్పై కూడా ఈ దశలవారీ విధానాన్నే వర్తింపజేయనున్నారు. సెప్టెంబర్ 10తో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ఆపరేటర్ కాంట్రాక్ట్ గడువు ముగిస్తుండటంతో, సెప్టెంబర్ 11 నుండి ఇక్కడ నూతన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. తొలిదశలో కేవలం గూడ్స్ వాహనాలకే పరిమితులు విధిస్తారు. బైకర్లు, ఉద్యోగుల ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహనాలకు ప్రస్తుతానికి ఫ్లైఓవర్పైకి ప్రవేశం కొనసాగుతుంది.
గత 19 నెలల గణాంకాల ప్రకారం ఎయిర్పోర్ట్ రోడ్, పీణ్య మరియు బీజీఎస్ ఫ్లైఓవర్లపై ఏకంగా 3,300 కంటే ఎక్కువ గూడ్స్ వాహనాల బ్రేక్డౌన్ (పాడవుట) సంఘటనలు నమోదయ్యాయి. ఇరుకైన ఫ్లైఓవర్లపై ఇటువంటి వాహనాలు మొరాయిస్తే గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. మరోవైపు ఈ రెండు ప్రధాన కారిడార్లపై జరిగిన ప్రమాదాల్లో అనేకమంది బైకర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ భద్రతా కారణాల వల్లే ఆంక్షలు తేవాల్సి వచ్చిందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు.
అయితే ఏకపక్షంగా ప్రవేశాన్ని రద్దు చేయడం కంటే, క్షేత్రస్థాయి విశ్లేషణల ఆధారంగా దశలవారీగా నిర్ణయాలు తీసుకోవడం సరైన మార్గమని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో అప్రోచ్ ర్యాంపుల వద్ద పరిస్థితులు, ప్రత్యామ్నాయ మార్గాల సాంద్రతను సమీక్షించిన పిమ్మటనే తదుపరి ఆంక్షలను అమలు చేయనున్నారు.


Click it and Unblock the Notifications
