బెంగళూరు పోలీసులు కొత్త రూట్.. ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెంపు.. కారణం ఏంటంటే..
Bengaluru నగరంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలపై ప్రభుత్వం తరచూ 50 శాతం మినహాయింపులు ప్రకటించడం పట్ల బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేపదే ఇస్తున్న ఈ రాయితీలు ట్రాఫిక్ నిబంధనల అమలును బలహీనపరుస్తున్నాయని.. వాహనదారులు ఉల్లంఘనలకు భయపడకుండా జరిమానాల చెల్లింపును వాయిదా వేస్తూ.. తదుపరి డిస్కౌంట్ ప్రకటన కోసం వేచి చూసే బాధ్యతారాహిత్య ధోరణికి అలవాటు పడుతున్నారని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ (KSLSA) ఇచ్చిన ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాలలో ఏకంగా ఆరుసార్లు 50 శాతం మినహాయింపును ప్రకటించింది. 2023లో మూడుసార్లు, 2025లో రెండుసార్లు, 2026లో ఇప్పటివరకు ఒకసారి ఈ రాయితీలు ఇచ్చారు.

జూన్ 21 నుండి జూలై 10 మధ్య ప్రకటించిన తాజా సడలింపు ద్వారా దాదాపు 19.13 లక్షల ట్రాఫిక్ చలాన్ కేసులు పరిష్కారమై రూ. 55 కోట్ల ఆదాయం సమకూరినప్పటికీ.. దీనివల్ల భవిష్యత్తులో ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసే అవకాశం లేకుండా పోతోందని సీనియర్ ట్రాఫిక్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాల్లో తమను సంప్రదించడం లేదని.. ఫలితంగా జరిమానాల అసలు ఉద్దేశమే దెబ్బతింటోందని వారు తెలిపారు
శిక్షాత్మక చర్యలు కఠినంగా ఉంటేనే వాహనదారుల్లో క్రమశిక్షణ వస్తుందని భావిస్తున్న ట్రాఫిక్ విభాగం.. ఉల్లంఘనలకు విధించే కనీస జరిమానాను రూ. 1,000కి పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. గతంలో 2019 మోటారు వాహనాల సవరణ చట్టం ప్రకారం హెల్మెట్ లేకుండా వాహనం నడపడం లేదా సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ప్రాథమిక నేరాలకు జరిమానాను ప్రభుత్వం రూ. 1,000 నుండి రూ. 500కి తగ్గించింది. ఆ తగ్గించిన మొత్తంపై కూడా మళ్లీ 50 శాతం తగ్గింపు ఇవ్వడంతో జరిమానాలు అతిస్వల్పంగా మారి.. ఉల్లంఘనదారులకు లెక్కలేకుండా పోయిందని పోలీసులు పేర్కొంటున్నారు.
గణాంకాలను పరిశీలిస్తే బెంగళూరులో ట్రాఫిక్ ఉల్లంఘనల తీవ్రత స్పష్టమవుతోంది. 2023లో 90 లక్షల ఉల్లంఘన కేసులు నమోదు కాగా.. 2024లో 83 లక్షలు, 2025లో 70 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇక 2026 ప్రారంభమైన కేవలం ఆరు నెలల్లోనే (జూన్ నాటికి) ఏకంగా 58 లక్షల కేసులు నమోదు కావడాన్ని బట్టి చూస్తే ఉల్లంఘనలు ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. జరిమానాల వసూళ్లు 2023లో రూ. 185 కోట్లు వస్తే.. 2025లో రూ. 258 కోట్లు, 2026 జూన్ నాటికి రూ. 77 కోట్లు నమోదయ్యాయి.
కేవలం జరిమానాలే కాకుండా నగరంలో నిరంతరం పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీసు శాఖ పలు కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. కార్పూలింగ్ విధానానికి చట్టబద్ధత కల్పించడం, నగరంలోని ప్రధాన ఫ్లైఓవర్లపై పగటిపూట భారీ వాహనాల (HMV) రాకపోకలను నియంత్రించడం, మెట్రో చివరి స్టేషన్ల వద్ద దూర ప్రాంత బస్సుల నిలిపివేతను పరిమితం చేయడం వంటి వ్యూహాత్మక ఆంక్షలను అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
