బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చెక్.. అతి పెద్ద ఫ్లైఓవర్ వచ్చేస్తోంది.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే..
భారతఐటీ రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ అంటే చెప్పనవసరం లేదు. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే ఆఫీసుకు ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. అలాగే సాయంత్రం ఆఫీసు నుండి బయలుదేరితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. అంతలా ట్రాఫిక్ సమస్య ప్రయాణికులను వెంటాడుతూ ఉంటుంది. గంటల తరబడి రోట్ల మీదనే గడపాల్సిన పరిస్థితి. అయితే దీనిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సమస్య మాత్రం తీరడం లేదు.
తాజాగా Bengaluru నగరంలో నానాటికీ తీవ్రమవుతున్న రోడ్డు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా డికె శివకుమార్ ప్రభుత్వం మరో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నగరంలోనే అత్యంత పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 'బెంగళూరు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్' (B-SMILE) అధికారికంగా బిడ్లను ఆహ్వానించింది. ఈ కారిడార్ లో భాగంగా యశ్వంత్పూర్లోని మతికెరె క్రాస్ నుండి కేఆర్ పురంలోని టిన్ ఫ్యాక్టరీ జంక్షన్ వరకు 28 కిలోమీటర్ల మేర సుదీర్ఘమైన ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు.

ఈ ప్రతిపాదిత కారిడార్ మార్గం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), మెహక్రి సర్కిల్, జయమహల్ రోడ్, సెయింట్ జాన్స్ చర్చ్ రోడ్, ఉల్సూర్ లేక్ వంటి నగరంలోని పలు కీలక ప్రాంతాల గుండా సాగుతుంది. మొత్తం రూ. 3,536.89 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును 'బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్ఫర్' (BOOT) పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 40 శాతం నిధులను ప్రభుత్వం 'వయబిలిటీ గ్యాప్ ఫండింగ్' రూపంలో అందించనుంది. టెండర్ దక్కించుకున్న ప్రైవేట్ నిర్మాణ సంస్థకు ఈ కారిడార్ను ఉపయోగించే వాహనాల నుండి 30 ఏళ్ల పాటు ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం టోల్ రుసుము వసూలు చేసుకునే హక్కు ఉంటుంది.కాబట్టి ప్రయాణికులు ఈ కారిడార్ గుండా ప్రయాణించాలంటే టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
బెంగళూరు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారుల విస్తరణ అనివార్యమైందని బి-స్మైల్ టెక్నికల్ డైరెక్టర్ బి.ఎస్. ప్రహ్లాద్ తెలిపారు. బూట్ నమూనా వల్ల ప్రైవేట్ సంస్థ ఈ ఫ్లైఓవర్ నాణ్యతను కాపాడుతూ.. నిరంతరం నిర్వహణ పనులను చేపడుతుందని, తద్వారా ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
బెంగళూరు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళిక చేసిన 11 కీలక ప్రాజెక్టులలో ఈ 28 కిలోమీటర్ల కారిడార్ ఒకటి కావడం గమనార్హం. వీటితో పాటు రాగిగుడ్డ జంక్షన్ నుండి తలఘట్టపుర జంక్షన్ వరకు 18.5 కిలోమీటర్ల మరో టోల్ ఫ్లైఓవర్ కోసం త్వరలోనే బిడ్లను పిలవనున్నారు. కాగా, మిగిలిన 9 ప్రాజెక్టులను పూర్తిగా ప్రభుత్వ నిధులతో చేపట్టే 'ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ మరియు కన్స్ట్రక్షన్' (EPC) నమూనా కింద ఇప్పటికే కేటాయించారు. ఈ కొత్త ఎలివేటెడ్ కారిడార్ల అందుబాటులోకి వస్తే నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.


Click it and Unblock the Notifications
