బెంగళూరు ట్రాఫిక్కు చెక్.. పోలీసులు సరికొత్త ప్లాన్.. రూల్స్ బ్రేక్ చేస్తే భారీ జరిమానాలు కట్టాల్సిందే..
బెంగళూరు నగరాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు.. అలాగే రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఐదు సూత్రాలతో కూడిన ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కర్ణాటక ప్రభుత్వానికి సమర్పించారు.
జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తీక్ రెడ్డి పర్యవేక్షణలో రూపొందించిన ఈ సిఫార్సులపై హోం మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర అధ్యక్షతన.. డీజీపీ డాక్టర్ ఎంఏ సలీం, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ సమక్షంలో ఉన్నత స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత, ప్రమాదాల గణాంకాలు, రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్ల డేటాను నిశితంగా విశ్లేషించిన తర్వాతే ఈ కీలక ప్రతిపాదనలను తయారు చేశారు.

ఈ ఐదు సూత్రాల ప్రణాళికలో ప్రధానంగా భారీ సరుకు రవాణా వాహనాలపై శాశ్వత నిషేధం విధించడం ఒక ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. భారీ ట్రక్కులను నగర సరిహద్దుల వద్దే నిలిపివేసి.. నగరంలోపల రవాణా కోసం కేవలం చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
అలాగే రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం 8 నుండి 10 గంటలు, సాయంత్రం 5 నుండి 7 గంటల సమయంలో ఎలాంటి సరుకు రవాణా వాహనాలను అనుమతించకూడదని భావిస్తున్నారు. మరోవైపు రోడ్లపై ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించేందుకు గతంలో ఐటీ నిపుణులు విస్తృతంగా వినియోగించిన యాప్ ఆధారిత కార్పూలింగ్ సేవలను తిరిగి చట్టబద్ధం చేయాలని పోలీసులు ప్రభుత్వాన్ని కోరారు. మహమ్మారికి ముందు ఈ సేవల వల్ల రోజుకు దాదాపు లక్ష ప్రైవేట్ వాహనాలు రోడ్లపైకి రాకుండా నివారించటం విశేషం.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు.. 2019లో తగ్గించిన భారీ జరిమానాలను తిరిగి పునరుద్ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి తీవ్రమైన తప్పిదాలకు జరిమానా మొత్తాలను రూ. 500 నుండి రూ. 1,000 వరకు పెంచడం ద్వారా వాహనదారులలో క్రమశిక్షణ తేగలమని భావిస్తున్నారు. దీనితో పాటు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న కొన్ని కీలకమైన ఫ్లైఓవర్లపై ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని నియంత్రించాలని.. అలాగే టాటా ఏస్, మినీ ట్యాంకర్ల వంటి చిన్న వాణిజ్య వాహనాలు ఫ్లైఓవర్లను ఉపయోగించకుండా నిషేధించాలని ప్రతిపాదించారు.
అలాగే నగరంలో అనధికారికంగా ఆగుతూ తీవ్ర ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్న ఆల్ ఇండియా పర్మిట్ ప్రైవేట్ బస్సులను నగరంలోకి రాకుండా నిరోధించాలని సిఫార్సు చేశారు. వీటిని నగరం శివార్లలోని నిర్దేశిత టెర్మినళ్ల వరకే పరిమితం చేసి.. అక్కడ నుండి ప్రయాణికులకు అనుసంధాన రవాణా సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నారు.
కాగా పోలీసుల నెలవారీ ట్రాఫిక్ అధ్యయనాల ప్రకారం భారీ వర్షాలు, పండుగలు, పాఠశాలల రద్దీ కారణంగా ప్రతి ఏటా జూన్ నుండి నవంబర్ మధ్య ట్రాఫిక్ అత్యధికంగా ఉంటోందని.. అందులోనూ సెప్టెంబర్ నెల అత్యంత రద్దీగా మారే నెలగా గుర్తించారు. దీనికి విరుద్ధంగా, వాతావరణం అనుకూలంగా ఉండి పాఠశాలల రద్దీ తక్కువగా ఉండే నవంబర్ నుండి మార్చి మధ్య కాలంలో నగరంలో ట్రాఫిక్ ప్రవాహం సాపేక్షంగా సాఫీగా సాగుతుందని విశ్లేషించారు.


Click it and Unblock the Notifications
