Bengaluru: 11 రోజుల్లో 4 సార్లు పెరిగిన ధరలు.. బండి తీయాలంటేనే భయపడుతున్న జనం!
దేశంలో ఇంధన ధరలు మళ్లీ మండిపోతున్నాయి. కేవలం 11 రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుడి నడుం విరిగిపోతోంది. ముఖ్యంగా ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) లో ఈ ధరల సెగలు మామూలుగా లేవు. నిత్యం ట్రాఫిక్తో నరకం చూసే ఇక్కడి జనాలకు, ఇప్పుడు ఇంధన ఖర్చులు చూస్తుంటే చెమటలు పడుతున్నాయి. తాజాగా 'లోకల్ సర్కిల్స్' అనే సంస్థ బెంగళూరు నగరంలో నిర్వహించిన ఒక సర్వేలో అక్కడి ప్రజల కష్టాలు, ఆవేదనలు అన్నీ ఇన్నీ కావని తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 61 శాతం మంది తాము రవాణా ఖర్చులను భరించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఓపెన్గా చెప్పారు. కేవలం 39 శాతం మంది మాత్రమే ప్రస్తుతానికి తాము మెయింటెన్ చేస్తున్న బండ్లు లేదా ప్రయాణ పద్ధతులతో హ్యాపీగా ఉన్నామని తెలిపారు.

ఒక్క ఇంధనమే కాదు.. అన్నీ ఖరీదే!
ఈ సర్వే కోసం బెంగళూరు (Bengaluru) కి చెందిన సుమారు 8,943 మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల కేవలం బండి నడపడమే కాదు.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని 48 శాతం మంది నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. సర్వీసుల ఖర్చులు కూడా పెరిగాయని మరో 37 శాతం మంది చెప్పారు. అయితే, ఈ ధరల పెరుగుదల వల్ల తమ జీవితాలపై పెద్దగా ప్రభావం పడలేదని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఖర్చులను తట్టుకోవడానికి మెజారిటీ జనం (57 శాతం మంది) అనవసరమైన ప్రయాణాలను, వీకెండ్ తిరుగుళ్లను పూర్తిగా తగ్గించుకున్నట్లు పేర్కొన్నారు.
జనం రూట్ మార్చారు.. కొత్త ప్లాన్స్ ఇవే!
డబ్బులు పొదుపు చేసుకోవడానికి బెంగళూరు వాసులు ఇప్పుడు సరికొత్త దారులు వెతుక్కుంటున్నారు. సర్వే ప్రకారం..
- 19 శాతం మంది: కార్ పూలింగ్ (వాహనాలను షేర్ చేసుకోవడం), మెట్రో, బస్సుల వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా టూ వీలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
- 29 శాతం మంది: వేర్వేరు పనుల కోసం విడివిడిగా కాకుండా, అన్ని పనులను ఒకే ట్రిప్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
- 30 శాతం మంది: ఇంధనం కోసం కచ్చితంగా డబ్బులు కావాలి కాబట్టి, ఇతరత్రా రోజువారీ ఖర్చులను కోసేస్తున్నారు.
- 21 శాతం మంది: దూర ప్రాంతాలకు వెళ్లకుండా, తమ ఇంటికి దగ్గర్లోనే దొరికే వస్తువులు, సేవలతో సరిపెట్టుకుంటున్నారు.
ధరల భారం వల్ల లగ్జరీ వస్తువులు, అవసరం లేని షాపింగ్లను పక్కన పెట్టేసినట్లు 14 శాతం మంది చెప్పారు. కాగా, పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా.. తాము మాత్రం ప్రయాణాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని 17 శాతం మంది ఒప్పుకున్నారు. ఏది ఏమైనా, బెంగళూరు (Bengaluru) లో బతకాలంటే ఇప్పుడు సంపాదనతో పాటు ఇంధనాన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.


Click it and Unblock the Notifications