బెంగుళూరు (Bengaluru) వాసులకు కరెంట్ షాక్ తగలనుంది. మే 1 నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచుతూ బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ (BESCOM) నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (KERC) ఈ ధరల పెంపునకు ఆమోదం తెలపడంతో, సామాన్యుడి నెలవారీ బడ్జెట్పై అదనపు భారం పడనుంది.
బెంగుళూరులో నివసిస్తున్న ప్రజలకు విద్యుత్ బిల్లుల రూపంలో అదనపు భారం పడబోతోంది. బెంగళూరు (Bengaluru) పరిధిలోని BESCOM వినియోగదారులకు మే 1వ తేదీ నుండి ప్రతి యూనిట్కు అదనంగా 56 పైసలు వసూలు చేయనున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక స్థిరత్వం కోసం కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (KERC) ఈ కొత్త ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే నెలలో మొదటి మీటర్ రీడింగ్ నుండి ఈ కొత్త రేట్లు వర్తించనున్నాయి.

ఎందుకు ఈ పెంపు? (ట్రూ-అప్ ఛార్జీలు)
2024-25 ఆర్థిక సంవత్సరంలో BESCOM దాదాపు రూ. 2,068 కోట్ల మేర నష్టాలను చవిచూసింది. ఈ లోటును పూడ్చుకోవడానికి 'ట్రూ-అప్' (True-Up) ప్రక్రియ ద్వారా వినియోగదారుల నుండి అదనపు సొమ్మును వసూలు చేయాలని నిర్ణయించారు. 2024-25లో మీరు వాడిన విద్యుత్ ఆధారంగా ఈ అదనపు మొత్తాన్ని లెక్కించి, దానిని 2026-27 ఆర్థిక సంవత్సరంలో సమాన నెలవారీ వాయిదాలలో (12 నెలలు) వసూలు చేస్తారు. అంటే మే 1, 2026 నుండి ఏప్రిల్ 30, 2027 వరకు మీ బిల్లులో 'FY25 True up Charges' పేరుతో ఈ అదనపు భారం కనిపిస్తుంది.
కారణాలు ఇవే!
విద్యుత్ కొనుగోలు ధరలు పెరగడం, ట్రాన్స్మిషన్ ఖర్చులు అధికమవ్వడం , ముఖ్యంగా వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడం వల్ల ఈ రేట్ల పెంపు అనివార్యమైందని అధికారులు చెబుతున్నారు. కేవలం బెంగుళూరు మాత్రమే కాదు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో కూడా మార్పులు ఉన్నాయి. అయితే, చాముండేశ్వరి ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్ (CESC) కస్టమర్లకు కేవలం 15 పైసల పెంపు మాత్రమే ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో (HESCOM, GESCOM) స్వల్ప తగ్గుదల కూడా ఉండవచ్చు.
వినియోగదారులు ఎలా సిద్ధపడాలి?
బెంగుళూరు వంటి నగరాల్లో ఇప్పటికే ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గట్టి షాక్ అనే చెప్పాలి.
ఎండలు మండిపోతున్న తరుణంలో ఏసీలు, కూలర్ల వాడకం ఎక్కువగా ఉండే మే నెల నుండే ఈ ధరల పెంపు అమలులోకి రావడం బెంగుళూరు వాసులకు ఇబ్బందికరమైన విషయమే. విద్యుత్ వినియోగాన్ని పొదుపుగా చేసుకోవడం ద్వారా కొంతవరకు బిల్లును తగ్గించుకోవచ్చు. వచ్చే ఏడాది పొడవునా ఈ ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేయనున్నారు కాబట్టి, మీ నెలవారీ ఖర్చుల్లో ఈ అదనపు కరెంట్ బిల్లును కూడా లెక్కలోకి తీసుకోవడం మంచిది. ప్రభుత్వం ఈ ఆదాయంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందని ఆశిద్దాం. ప్రస్తుతానికి మాత్రం, విద్యుత్ ఆదా చేయడం ఒక్కటే సామాన్యుడి ముందున్న మార్గం.


Click it and Unblock the Notifications