బెంగళూరు వాసులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ నుంచి జనవరి వరకు ట్రాఫిక్ కష్టాలు షురూ.. కారణం ఏంటంటే..
భారత ఐటీ రాజధాని బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) కారిడార్లో ప్రయాణించే ఐటీ ఉద్యోగులకు, నగర వాసులకు త్వరలోనే తీవ్ర ట్రాఫిక్ కష్టాలు ఎదురుకానున్నాయి. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఈ అత్యంత రద్దీ మార్గంలో వైట్ టాపింగ్ రహదారి పనులను అక్టోబర్ నెల నుండి ప్రారంభించాలని యోచిస్తోంది. గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ ఈ ప్రాజెక్టును అక్టోబర్లో ప్రారంభించి, 2027 జనవరి నాటికి ఏలాంటి విరామం లేకుండా పూర్తి చేయాలని అధికారులను అధికారికంగా ఆదేశించారు.
నిర్మాణ పనుల వల్ల రహదారిపై ప్రయాణికులకు కలిగే తీవ్ర అంతరాయాన్ని తగ్గించడానికి, ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ORR వెంబడి ఉన్న బహుళజాతి కంపెనీలతో సంప్రదింపులు జరిపి, ఈ పనుల కాలంలో కనీసం 50 శాతం ఉద్యోగులకు వర్క్-ఫ్రమ్-హోమ్ (WFH) లేదా హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి సూచించారు. అయితే, ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ పనులను తక్షణమే చేపట్టడం సాధ్యమేనా అనే అంశంపై సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసు విశ్లేషణల ప్రకారం.. సాధారణంగా ఒక రోడ్డు లేన్కు గంటకు 1,200 నుండి 1,300 ప్యాసింజర్ కార్ యూనిట్లు (PCUలు) ప్రయాణించడం ఆదర్శవంతమైన సామర్థ్యంగా పరిగణించబడుతుంది. కానీ ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై తీవ్ర రద్దీ సమయాల్లో ప్రతి లేన్కు గంటకు సుమారు 2,800 PCUల వరకు వాహనాలు ప్రయాణిస్తూ రహదారిపై ఊహించని భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే కిక్కిరిసిపోతున్న ఇటువంటి పరిమితి దాటిన పరిస్థితుల్లో వైట్-టాపింగ్ పనులను ప్రారంభించి లేన్లను మూసివేస్తే.. వాహనాల రాకపోకలను నియంత్రించడం, ట్రాఫిక్ నిర్వహణ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్న వ్యవహారంగా మారుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మంత్రి ఆదేశాల మేరకు నిర్మాణ పనుల సమయంలో వాహనాలను పక్కదారి మళ్లించేందుకు అంతర్గత రహదారులను ఉపయోగించాలని యోచిస్తున్నప్పటికీ.. ఆచరణలో అది సాధ్యపడకపోవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు కారిడార్లో ప్రత్యామ్నాయ మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయని, నిర్మాణ పనుల కోసం ప్రధాన లేన్లను మూసివేసినప్పుడు లేదా వాహనాల రాకపోకలను నియంత్రించినప్పుడు ట్రాఫిక్ను మళ్లించడానికి తగినంత స్థలం లేకపోవడం పెద్ద సమస్యగా మారనుందని సీనియర్ ట్రాఫిక్ అధికారి ఒకరు తెలిపారు.
దీనికి ప్రత్యామ్నాయంగా మొత్తం 17 కిలోమీటర్ల పరిధిలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ప్రధాన రహదారిని సర్వీస్ రోడ్డుతో విలీనం చేయాలని పోలీసులు ప్రతిపాదించారు. కాగా, ఈ ప్రణాళికలో భాగాంగా ఉన్న 18 ప్రవేశ-నిష్క్రమణ పాయింట్లలో ఇప్పటికే 13 పాయింట్ల పనులు పూర్తయ్యాయి. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, సదరు మార్గంలో ప్రస్తుతం వేగంగా జరుగుతున్న మెట్రో నిర్మాణం పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ వైట్-టాపింగ్ పనులను చేపట్టాలని, ఎందుకంటే మెట్రో మరియు వైట్-టాపింగ్ పనులను ఒకేసారి నిర్వహించడం వల్ల నగరంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అక్టోబర్లో పనులు ప్రారంభించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను గ్రేటర్ బెంగళూరు ఐటీ మరియు కంపెనీల సంఘం స్వాగతించింది. అయితే, ఆ కారిడార్లోని అనేక కంపెనీలు నవంబర్ చివరి నుండి జనవరి ఆరంభం వరకు మాత్రమే తమ సిబ్బందికి హైబ్రిడ్ పనివిధానానికి మారే సౌకర్యాన్ని కల్పించగలవని సంఘం స్పష్టం చేసింది.
ఈ విషయంపై మాట్లాడిన గ్రేటర్ బెంగళూరు ఐటీ, కంపెనీల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ గౌడ, డిసెంబర్ మాసంలో వరుస పండుగలు, ఎక్కువ సెలవులు ఉండటంతో పాటు ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో హైబ్రిడ్ మోడల్లో ఇళ్ల నుంచే పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా ఆ సమయంలో రహదారులపై సహజంగానే వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుంది కాబట్టి, అక్టోబర్కు బదులుగా డిసెంబర్ నుండి ఈ వైట్ టాపింగ్ పనులను పూర్తిస్థాయిలో ప్రారంభిస్తే ప్రభుత్వానికి, ఐటీ ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications
