Bengaluru: పిల్లల పెంపకానికి అంత ఖర్చా? ఒక తల్లి తీసుకున్న నిర్ణయంపై నెట్టింట రచ్చ!

ఈ రోజుల్లో సిటీల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే దంపతులకు పిల్లల పెంపకం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, పని ఒత్తిడి మధ్య పిల్లలను చూసుకోవడం కత్తిమీద సాము లాంటిదే. తాజాగా బెంగళూరుకు చెందిన పర్వీన్ చౌదరి అనే తల్లి తన పిల్లల పెంపకం కోసం తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. తన ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఆమె ఏకంగా ఇద్దరు నానీలను (పిల్లల సంరక్షకులు) పెట్టుకుని, వారికి నెలకు రూ. 46,000 చెల్లిస్తోంది.

Bengaluru mom pays 46000 for nannies sparking online debate on parenting and privilege in India

అసలు విషయం ఏంటి?

పర్వీన్ చౌదరికి మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. తన ఇన్ స్టాగ్రామ్ వీడియోలో ఆమె తన ఇంటి పని మనుషులు, నానీల వివరాలను పంచుకుంది. అందులో ఒక నానీకి నెలకు రూ. 32,000 ఇస్తుండగా ఆమె వంట, ఇంటి పనితో పాటు రోజుకు 11 గంటల పాటు పిల్లలను చూసుకుంటుంది. అవసరమైతే రాత్రి పూట కూడా అక్కడే ఉంటుంది. ఇక రెండో నానీకి నెలకు రూ. 14,000 ఇస్తున్నారు. ఈమె మొదటి నానీకి సాయం చేస్తూ.. ఆమె లేని సమయంలో పిల్లల బాధ్యత చూసుకుంటుంది.

ఇది కేవలం డబ్బు వ్యవహారం కాదు!

ఈ ఖర్చుపై పర్వీన్ స్పందిస్తూ.. "నేను వారిని కేవలం పని మనుషులుగా చూడటం లేదు, వారు నా కుటుంబంలో ఒక భాగం. నా పిల్లలను చూసుకోవడానికి ఇద్దరు ప్రేమగల పిన్నిలు దొరికినట్లు భావిస్తున్నాను. నేను నా పనిపై దృష్టి పెట్టాలన్నా, ప్రశాంతంగా ప్రయాణాలు చేయాలన్నా వీరి సహకారం చాలా ముఖ్యం." అని చెప్పుకొచ్చింది. అలాగే తను ఇస్తున్న జీతంతో ఆ నానీలు తమ ఊర్లో ఉన్న తమ పిల్లలను బాగా చదివించుకుంటున్నారని, ఇది ఒక రకంగా వనరుల మార్పిడి అని ఆమె అభిప్రాయపడింది.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆమెను సమర్థిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. సమర్థించే వారు.. "మహిళలు తమ కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి ఇలాంటి సాయం తీసుకోవడంలో తప్పులేదు. ఇంటి పని చేసే వారికి సరైన గౌరవం, జీతం ఇస్తున్నందుకు ఆమెను అభినందించాలి" అని అంటున్నారు. ఇక విమర్శించే వారు.. "గంటకు రూ. 110 చొప్పున ఇవ్వడం అంటే ఇది పేదరికాన్ని సొమ్ము చేసుకోవడమే. కేవలం భారతదేశంలోనే ఇంత తక్కువకు శ్రమ దొరుకుతుంది" అని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం.. "పిల్లలను వేరే వాళ్ల చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు, తల్లి ఇచ్చే సంస్కారం నానీలు ఇవ్వలేరు" అని కామెంట్ చేస్తున్నారు.

పర్వీన్ గట్టి కౌంటర్

విమర్శలకు పర్వీన్ తనదైన శైలిలో బదులిచ్చింది. "మదర్ ఇండియా లాగా అన్నీ త్యాగం చేసే తల్లులకు ఎవరూ అవార్డులు ఇవ్వరు. ఇంటి పనులతో అలసిపోతే పిల్లలకు నాణ్యమైన సమయాన్ని ఇవ్వలేము. నానీలు ఉండటం వల్ల నాకు పని భారం తగ్గింది. అందుకే నేను పిల్లలతో కలిసి బుక్స్ చదవడానికి, ప్రకృతిలో గడపడానికి ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నాను" అని స్పష్టం చేసింది. బెంగళూరు వంటి నగరాల్లో ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండటం తన అదృష్టమని ఆమె పేర్కొంది.

చివరికి ఈ చర్చ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే.. పిల్లల పెంపకం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి, అవసరాలను బట్టి వారు తమ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు. కానీ, ఇంటి పని చేసే వారికి గౌరవప్రదమైన వేతనం ఇవ్వడం అనేది మంచి పరిణామమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+