Bengaluru: మెట్రోలో కూర్చుంటే నేరుగా స్టేడియం లోపలికే.. బెంగళూరు కొత్త మెట్రో ప్లాన్ చూస్తే ఆశ్చర్యపోతారు!
బెంగళూరు అంటేనే ట్రాఫిక్ కష్టాలు, ఆఫీసుకి వెళ్లాలంటే గంటల తరబడి వెయిటింగ్. కానీ రాబోయే రోజుల్లో బెంగళూరు (Bengaluru) లో ప్రయాణం మరింత ఈజీ కాబోతోంది. తాజాగా నమ్మ మెట్రో ఒక భారీ ప్లాన్ను సిద్ధం చేసింది. నగరంలోనే అత్యంత పొడవైన సింగిల్ మెట్రో కారిడార్ను నిర్మించేందుకు కసరత్తు మొదలైంది. దాదాపు 73 కిలోమీటర్ల మేర సాగే ఈ కొత్త లైన్ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం.

స్టేడియం దాకా మెట్రో రైలు!
ఈ కొత్త మెట్రో లైన్ దక్షిణ బెంగళూరులోని కాలెన అగ్రహార నుంచి మొదలై, తూర్పున ఉన్న కడుగోడి ట్రీ పార్క్ వరకు వెళ్తుంది. ఇది కేవలం సాధారణ లైన్ మాత్రమే కాదు, మధ్యలో సర్జాపూర్ వంటి ఐటీ కారిడార్లను కలుపుతూ సాగుతుంది. అయితే ఇందులో హైలైట్ ఏంటంటే.. అనేకల్ తాలూకాలో ప్రభుత్వం నిర్మించబోతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం ప్రత్యేకంగా ఒక 5 కిలోమీటర్ల 'స్పూర్ లైన్'ను యాడ్ చేశారు. అంటే, ఇక మ్యాచ్ చూడటానికి వెళ్లే ఫ్యాన్స్ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా నేరుగా స్టేడియం పక్కనే ఉన్న మెట్రో స్టేషన్లో దిగిపోవచ్చు. దీనికోసం ఇండ్లవాడి దగ్గర మరో స్టేషన్ కూడా ప్లాన్ చేశారు.
ఎందుకు ఈ లైన్ స్పెషల్?
నిజానికి బెంగళూరు చుట్టుపక్కల ఉన్న తుమకూరు లేదా బిడది వంటి ప్రాంతాలకు మెట్రో వేయడం కంటే, ఈ సర్జాపూర్ - అనేకల్ రూట్ చాలా కీలకం అని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో ఐటీ కంపెనీలు, స్టార్టప్స్ వేగంగా పెరుగుతున్నాయి. పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా కూడా స్టేడియంకు మెట్రో కనెక్టివిటీ లేకపోతే అది వృథా అవుతుందని గతంలోనే హెచ్చరించారు. అందుకే ప్రభుత్వం ఈ లైన్ను అత్యంత వేగంగా పట్టాలెక్కించాలని చూస్తోంది. ఇదంతా కూడా 'ఎలివేటెడ్' (పిల్లర్లపై) కారిడార్గా ఉండబోతోంది.
హోసూరు మెట్రోకు చిక్కులు?
మరోవైపు తమిళనాడులోని హోసూరుకు, బెంగళూరులోని బొమ్మసంద్రకు మధ్య ఇంటర్ స్టేట్ మెట్రో వేయాలనే ప్రతిపాదన ఉంది. కానీ దీనిపై కర్ణాటక ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి టెక్నికల్ కారణాలు కూడా ఉన్నాయి. తమిళనాడు మెట్రోలో ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లు వాడితే, బెంగళూరు మెట్రోలో కింద ఉండే 'థర్డ్ రైల్' ద్వారా పవర్ తీసుకుంటారు. ఈ రెండు వేర్వేరు టెక్నాలజీల వల్ల రైళ్లు ఒక పట్టా మీద నుంచి ఇంకో పట్టా మీదకు వెళ్లడం కష్టం. అందుకే బొమ్మసంద్ర నుంచి అత్తిబెలె వరకు మాత్రమే మెట్రో లైన్ పొడిగించాలని బిఎంఆర్సిఎల్ (BMRCL) భావిస్తోంది. బోర్డర్ దాటాక తమిళనాడు వాళ్లు తమ మెట్రో స్టేషన్ కట్టుకోవచ్చని, రెండింటినీ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జితో కలపవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ప్రస్తుతానికి దీనికి సంబంధించిన 'ఫీజిబిలిటీ స్టడీ' పూర్తయింది. త్వరలోనే దీనిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ తర్వాత డీపీఆర్ (DPR) తయారీకి ఏడాది సమయం పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు అన్నీ వస్తే, 2029 నాటికి దీని నిర్మాణం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ 73 కిలోమీటర్ల భారీ ప్రాజెక్టు గనుక పూర్తయితే, బెంగళూరు (Bengaluru) ట్రాఫిక్ కష్టాలకు చాలా వరకు చెక్ పడినట్టే!


Click it and Unblock the Notifications