హైదరాబాద్కు పోటీగా బెంగళూరు కొత్త నిర్ణయం. ఇకపై వాటికి టాక్స్ లేదు!
బెంగళూరు ఇప్పటికే పెద్ద ఐటీ హబ్గా పేరు పొందింది. అయితే దీన్ని మరింత విస్తరించడంలో భాగంగా కర్నాటక ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఐటీ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ.. కొత్త ఐటీ పాలసీని తీసుకొచ్చింది. బెంగళూరు ఐటీ(Bengaluru IT) రంగాన్ని సిటీకి వెలుపల.. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఏర్పాటయ్యే విధంగా కంపెనీలకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వనుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కర్ణాటక ప్రభుత్వం రీసెంట్గా కొత్త ఐటీ పాలసీ 2025-30ని ప్రకటించింది. ఇందులోభాగంగా రాష్ట్ర టెక్ వ్యవస్థను విస్తరించే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు భారీగా ఖర్చు తగ్గింపు ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఈ కొత్త పాలసీ ప్రకారం బెంగళూరు సిటీకి బయట టైర్1, టైర్2 నగరాల్లో నిర్మించే ఐటీ కంపెనీళకు అద్దె, ఆస్తి పన్ను, విద్యుత్ ఛార్జీలు, టెలికాం ఖర్చులపై రీయింబర్స్ మెంట్ ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంతో బెంగళూరు సిటీ మరింత విస్తరించడంతోపాటు ఐటీ హబ్ కూడా మరింత డెవలప్ అవ్వనుంది.
పాలసీ హైలైట్స్
ఈ పాలసీలో భాగంగా ఐటీ కంపెనీలకు రూ. 2 కోట్ల వరకు 50 శాతం అద్దె రీయింబర్స్మెంట్, మూడు సంవత్సరాల పాటు 30 శాతం ఆస్తి పన్ను రీయింబర్స్మెంట్ తో పాటు ఐదు సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలను 100 శాతం మాఫీ చేయనున్నారు. అలాగే రూ. 12 లక్షల వరకు టెలికాం, ఇంటర్నెట్ ఛార్జీలలో 25 శాతం ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. మొత్తంగా ఈ పాలసీ కోసం ప్రభుత్వం రూ.445 కోట్ల బడ్జెట్ కేటాయించనుంది. ఈ కొత్త నిర్ణయం కొత్తగా ఏర్పాటయ్యే చిన్న ఐటీ కంపెనీలకు మేలు చేకూరుస్తుంది.
కొత్త టెక్ హబ్ల కోసం..
బెంగళూరులోని ఐటీ హబ్ ను ఇతర నగరాలకు విస్తరించడానికి ఈ పాలసీ బాగా పనికొస్తుంది. కర్నాటకలోని మైసూరు, మంగళూరు, హుబ్బల్లి, కలబురగి, బెలగావి, శివమొగ్గ, దావణగెరె వంటి నగరాలకు టెక్నాలజీ రంగాన్ని తరలించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందుకే టైర్ 2, టైర్ 3 సిటీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. మొదటి మూడు సంవత్సరాల్లో మెయింటెనెన్స్ ఖర్చుల్ని తగ్గించడం ద్వారా కొత్త టెక్ క్లస్టర్ల ఏర్పాటుని వేగవంతం చేయాలని కర్నాటక ప్రభుత్వం భావిస్తోంది.
రద్దీ తగ్గించేలా..
కర్నాటక తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ ద్వారా బెంగళూరు నగరంలో రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. బెంగళూరులో ఉన్న టెక్ హబ్ ప్రాంతాల్లో కంపెనీలు, ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగడంతో సిటీలో రద్దీ, ట్రాఫిక్, మౌలిక వసతులపై ఒత్తిడి పెరిగింది. ఈ కొత్త పాలసీ ద్వారా ఈ సమస్య కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇకపై కర్నాటకలోని టైర్ 2 సిటీలతో పాటు బెంగళూరు అవుట్ సైడ్ కూడా మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications


