Bengaluru: ఐటీ ఉద్యోగులకు అలర్ట్! ఆ ఏరియాలో సగం రోడ్లు క్లోజ్.. ఇక 11 నెలల పాటు నరకమే..
బెంగళూరు అంటేనే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటేనే ఔటర్ రింగ్ రోడ్డు (ORR). ఇప్పుడు ఈ రోడ్డు మీద ప్రయాణించే ఐటీ ఉద్యోగులకు మరో పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. సిల్క్ బోర్డ్ జంక్షన్ నుంచి కె.ఆర్ పురం మెట్రో స్టేషన్ వరకు ఉన్న 17.1 కిలోమీటర్ల మేర రోడ్డును 'గ్లోబల్ స్టాండర్డ్స్'లో డెవలప్ చేయాలని బెంగళూరు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (B-SMILE) నిర్ణయించింది. అయితే, మొదట అనుకున్న ప్లాన్ మార్చి, ఇప్పుడు ఈ స్ట్రెచ్ను వైట్ టాపింగ్ (సిమెంట్ రోడ్డు) చేయాలని ఫిక్స్ అయ్యారు.

ప్లాన్ ఎందుకు మారింది?
నిజానికి ఈ రోడ్డును తారుతో (Black-topping) వేయాలని భావించారు. కానీ గత మూడు నెలల్లో తారు ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల బిటుమెన్ ధరలు భారీగా పెరిగాయి. తారు రోడ్డు వేస్తే 7 నుండి 10 ఏళ్లు మాత్రమే మన్నుతుంది, కానీ వైట్ టాపింగ్ చేస్తే దాని జీవితకాలం రెట్టింపు అవుతుంది. అందుకే దాదాపు రూ. 368 కోట్ల వ్యయంతో ఈ మెయిన్ రోడ్డును వైట్ టాపింగ్ చేయనున్నారు. అయితే సర్వీస్ రోడ్లు మాత్రం తారుతోనే ఉండబోతున్నాయి.
రానున్న 11 నెలలు ట్రాఫిక్ గండం
ఈ పనుల వల్ల అసలు సమస్య మొదలవుతుంది. ఈ రోడ్డు నిర్మాణానికి 11 నెలల సమయం పడుతుందని అంచనా. అంటే దాదాపు ఏడాది పాటు ఈ కీలకమైన ఐటీ కారిడార్లో రోడ్డు సగానికి పైగా మూతపడుతుంది. ఇప్పటికే గంటల కొద్దీ ట్రాఫిక్తో సతమతమయ్యే ఐటీ ఉద్యోగులకు ఇది పెద్ద తలనొప్పిగా మారనుంది.
ట్రాఫిక్ పోలీసుల వెర్షన్ ప్రకారం.. మెట్రో బ్లూ లైన్ (Phase 2A) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పనులు మొదలుపెడితే జనాలకు కాస్త ఊరట ఉండేది. కానీ మెట్రో కంటే ముందే రోడ్డు పనులు మొదలయ్యేలా ఉన్నాయి. దీనివల్ల ప్రతి జంక్షన్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణలో కోత
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గతంలో కాంట్రాక్టర్లు 10 ఏళ్ల పాటు రోడ్డు మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోవాలని నిబంధన ఉండేది. కానీ కొత్త టెండర్లలో ఈ కాలాన్ని కేవలం 3 ఏళ్లకు తగ్గించేశారు. దీనివల్ల క్వాలిటీ విషయంలో ప్రజల్లో అనుమానాలు మొదలవుతున్నాయి.
బి-స్మైల్ అధికారులు మాత్రం.. "కొన్ని నెలల పాటు ఇబ్బంది ఉన్నా, లాంగ్ టర్మ్లో వైట్ టాపింగ్ వల్ల ట్రాఫిక్ సాఫీగా సాగుతుంది" అని చెబుతున్నారు. పనులు వేగంగా పూర్తి చేయడానికి రాత్రిపూట కూడా మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించనున్నట్లు సమాచారం.
ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూపు!
ఈ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయాణికులు ఇప్పట్నుంచే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' లేదా ఫ్లెక్సిబుల్ పని వేళలను ఎంచుకోవాలని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సూచించే అవకాశం ఉంది. అలాగే, బెంగళూరు మెట్రో బ్లూ లైన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నందున, ఈ ఓటర్ రింగ్ రోడ్డు స్ట్రెచ్లో ప్రయాణం అనేది కత్తి మీద సాములా మారబోతోంది. ప్రభుత్వం రాత్రి వేళల్లో పనులు వేగవంతం చేసినప్పటికీ, నగర వాసులు మాత్రం రాబోయే 11 నెలల పాటు ఓపిక పట్టక తప్పదు. చివరికి ఈ పనులు పూర్తయితే, ప్రపంచ స్థాయి నాణ్యమైన రోడ్లు మనకు అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications