హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే.. అత్యధిక వేగంతో బుల్లెట్ రైలు వచ్చేస్తోంది..
భారతదేశంలో రాబోయే హై-స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశ రవాణా రంగంలో మరో విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుంది. బెంగళూరు - హైదరాబాద్లను కలుపుతూ ప్రతిపాదించబడిన ఈ హై-స్పీడ్ రైలు కారిడార్ రెండు రాష్ట్రాల మధ్య వేగాన్ని గణనీయంగా తగ్గించనుంది. ప్రస్తుతం ట్రెయిన్ ద్వారా దాదాపు 19 గంటలు పడే ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం రెండు గంటలకు రాబోయే బుల్లెట్ స్పీడ్ రైలు తగ్గించనుంది. సాంకేతిక, విద్యా, వ్యాపార రంగాల్లో కీలకమైన ఈ నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ మరింత ఆధునిక మౌలిక సదుపాయాల దిశగా భారతాన్ని ముందుకు తీసుకువెళ్తుంది.
ఈ ప్రాజెక్ట్ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ (MAHSR) తరహాలో రూపొందించబడింది. బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం 626 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండనుంది. ప్రస్తుతం ఈ కారిడార్కు సంబంధించిన తుది సర్వేలు, అలైన్మెంట్ పనులు ప్రభుత్వ యాజమాన్యంలోని RITES లిమిటెడ్ ద్వారా వేగంగా కొనసాగుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్ట్కు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) మార్చి 2026 నాటికి సిద్ధమవుతుంది. ఆ తర్వాత ఇది రైల్వే బోర్డు పరిశీలనకు పంపబడుతుంది, తదుపరి ఆమోదం కోసం క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (CCEA) కి పంపబడుతుంది.

ఈ కారిడార్పై నడిచే బుల్లెట్ రైళ్లు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్లు వేగాన్ని చేరుకోగలవు. ఆపరేటింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్లు ఉంటుంది. ఈ అత్యధిక వేగాలు సాధ్యపడటం వల్లే 626 కిమీ దూరం కేవలం రెండు గంటల్లో పూర్తి కావచ్చు. దీని ద్వారా దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాధాన్యం గల టెక్ నగరాలు అయిన బెంగళూరు, హైదరాబాద్, అత్యంత వేగవంతమైన సౌకర్యవంతమైన రవాణాతో పరస్పరం అనుసంధానం కానున్నాయి.
ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య సాధారణ ట్రెయిన్ ప్రయాణం దాదాపు 19 గంటలు పడుతోంది. విమాన ప్రయాణం కొన్ని గంటలకే ముగిసినా, నగర కేంద్రాలకు రాకపోకలు, విమానాశ్రయ ప్రక్రియలు, ప్రయాణ ఖర్చులు వంటి అంశాలు అనేకమందికి అవరోధాలుగా ఉంటాయి. కానీ కొత్త బుల్లెట్ రైలు ద్వారా రెండు గంటల్లో చేరుకునే అవకాశం ఉండటం ప్రయాణికులందరికీ భారీగా లాభం చేకూరే అవకాశం ఉంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హై-స్పీడ్ కనెక్టివిటీ అనేక వర్గాల ప్రజలకు ప్రయోజనం అందిస్తుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఐటి ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు ఈ సేవల వల్ల ఎంతో సమయాన్ని ఆదా చేసుకోగలరు. పరిశ్రమల విస్తరణకు, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు, నగరాల మధ్య ఆర్థిక కార్యకలాపాల వేగవంతతకు ఈ రైలు కీలకంగా మారుతుంది.
దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థ ఈ Bullet Train ప్రాజెక్ట్ ద్వారా భారీగా లాభపడుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వేగవంతమైన రవాణా కారణంగా పెట్టుబడులు పెరుగుతాయి, వాణిజ్యం విస్తరిస్తుంది, రెండు నగరాల మధ్య మానవ వనరుల మార్పిడి మరింత చురుకుగా మారుతుంది. రాబోయే సంవత్సరాల్లో ఈ బుల్లెట్ రైలు ఆ ప్రాంతంలో అభివృద్ధికి ప్రధాన దిక్సూచి అవుతుందనే ఆశాభావం పలువురు నుంచి వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications