బెంగళూరులో ఆటో ఛార్జీల బాదుడు.. బైక్ ట్యాక్సీల కొరతతో ప్రయాణికుల నానా అవస్థలు..
Bengaluru నగరంలో రోజువారీ ప్రయాణికులకు ప్రయాణం తీవ్ర ప్రహసనంగా మారింది. గత కొన్ని వారాలుగా ఆటో రిక్షాల ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని.. ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని నగరవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణానికి ఉపకరించే బైక్ ట్యాక్సీల లభ్యత గణనీయంగా తగ్గిపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో బైక్ ట్యాక్సీలపై ఆధారపడిన ప్రయాణికులు, ఇప్పుడు ప్రత్యామ్నాయాలు లేక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా మలుచుకుంటున్న కొంతమంది ఆటో డ్రైవర్లు, ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని విపరీతంగా బేరసారాలు సాగిస్తున్నారు.
యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకోవడం కూడా ఇప్పుడు ప్రయాణికులకు ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. వివిధ డిజిటల్ యాప్ల ద్వారా ఆటోను రైడ్ చేసే సమయంలో డ్రైవర్లు అనుసరిస్తున్న తీరుపై ప్రయాణికులు పలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకే సమయంలో అనేక యాప్ల నుండి బుకింగ్లను స్వీకరిస్తున్న ఆటో డ్రైవర్లు, తక్కువ ధరకు ఉన్న రైడ్లను నిష్కర్షగా రద్దు చేస్తున్నారు.

యాప్లో డిస్ప్లే అయ్యే ఛార్జీ తక్కువగా ఉందంటూ ప్రయాణికులకు నేరుగా ఫోన్ చేసి అదనపు మొత్తం డిమాండ్ చేయడం లేదా రైడ్ అంగీకరించేలా చేయడానికి ప్రయాణికులే సొంతంగా 'టిప్' జోడించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యాప్ ద్వారా వచ్చిన బుకింగ్ను యాప్లోనే రద్దు చేయించి.. పరస్పరం మాట్లాడుకున్న ఎక్కువ మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో చెల్లించాలని కోరుతున్నారు.
కార్పొరేట్ ఉద్యోగి అంజనా నాయర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు తక్కువ ధర ఉన్న బుకింగ్ను రద్దు చేయడంతో అకస్మాత్తుగా ఛార్జీ రూ. 70-80కి పెరిగిపోతుంది. ఆ ఖర్చులను భరించడం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా రూ. 50 ఖర్చయ్యే తక్కువ దూరాలకు కూడా ఆటోలు తరచుగా రూ. 70-80 కంటే తక్కువకు ఒప్పుకోవడం లేదని మరో ప్రయాణికుడు ఆదర్శ్ తెలిపారు. ప్రభుత్వ రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటో ఛార్జీలు మొదటి 2 కిలోమీటర్లకు రూ. 36 గాను, ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటరుకు రూ. 18 గానూ నిర్ణయించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది.
గతంలో సుమారు రూ. 240 ఖర్చయ్యే ప్రయాణానికి, ఇప్పుడు సుమారు రూ. 300 లేదా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రయాణికురాలు రాధిక తెలిపారు. రోజువారీ రద్దీ సమయాల్లో మరో వాహనం దొరకకపోవడంతో వేరే మార్గం లేక ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందని, దీంతో తాము సిటీ బస్సులు, మెట్రో రైళ్లను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నామని చెప్పారు. యాప్ ఆధారిత బుకింగ్లు ప్రయాణికులకు సులభమైన మరియు పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు ఆ ఉద్దేశ్యాన్నే దెబ్బతీస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్ల అదనపు వసూళ్లను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications
