Bengaluru: బెంగళూరు ఆటో రేట్లపై రచ్చ.. భారీగా పెరగనున్న మీటర్ ఛార్జీలు! సామాన్యుల రియాక్షన్ ఇదే!
సిలికాన్ సిటీ బెంగళూరు (Bengaluru) లో ప్రయాణం అంటేనే ఒక సవాలు. ట్రాఫిక్ కష్టాలు ఒకవైపు ఉంటే, ఇప్పుడు ఆటో ఛార్జీల పెంపు ప్రతిపాదన సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఆటో LPG ధరలు ఆకాశాన్ని తాకడంతో, బెంగళూరులోని ఆటో డ్రైవర్ల సంఘాలు కనీస ఛార్జీలను (Minimum Fare) పెంచాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాయి.

ధరల పెరుగుదల భారం
గత కొద్ది వారాలుగా ఆటో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో లీటర్ LPG ధర సుమారు రూ. 56 ఉండగా, అది కాస్తా ఇప్పుడు ఏకంగా రూ. 95కి చేరుకుంది. దీనికి తోడు నగరంలో గ్యాస్ కొరత కూడా వేధిస్తోంది. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సి వస్తోందని, దీనివల్ల తమ సంపాదన పడిపోవడమే కాకుండా ఆర్థికంగా చితికిపోతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ప్రస్తుతం ఉన్న కనీస ఛార్జీ రూ. 36ను రూ. 50కి పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
డ్రైవర్ల డిమాండ్లు ఏంటి?
బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్కు ఆటో సంఘాలు అందజేసిన వినతిపత్రం ప్రకారం వారి కోరికలు ఇవే..
- మినిమం ఛార్జీ: ప్రస్తుతం ఉన్న రూ. 36 నుంచి రూ. 50కి పెంచాలి.
- కిలోమీటర్ రేటు: అదనంగా ప్రయాణించే ప్రతి కిలోమీటర్కు ఇప్పుడున్న రూ. 18 ఛార్జీని రూ. 25కి పెంచాలి.
"ప్రజలకు ఇబ్బంది కలగాలని మాకు లేదు, కానీ మాకు వేరే దారి కనిపించడం లేదు" అని డ్రైవర్ల సంఘం నేతలు చెప్తున్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల వచ్చే ఆదాయం అంతా గ్యాస్ కొరకే ఖర్చవుతోందని వారు వాపోతున్నారు.
ప్రయాణికుల స్పందన ఎలా ఉంది?
ఆటో ఛార్జీల పెంపు వార్తలపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ప్రయాణికులు డ్రైవర్ల కష్టాలను గుర్తిస్తున్నప్పటికీ, రూ. 50 మినిమం ఫేర్ అంటే చాలా ఎక్కువ అని అభిప్రాయపడుతున్నారు. రూ. 40 లేదా రూ. 45 అయితే కొంతవరకు భరించొచ్చని, అలాగే భవిష్యత్తులో గ్యాస్ ధరలు తగ్గితే ఆటో ఛార్జీలు కూడా తగ్గించాలని వారు కోరుతున్నారు.
మరోవైపు, ఇప్పటికే ఓలా, ఉబెర్ వంటి యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆటోలకు సర్జ్ ప్రైసింగ్ పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని, మళ్ళీ మీటర్ రేట్లు పెంచితే సామాన్యులు ఆటో ఎక్కలేరని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు వంటి నగరంలో ఆటోలు మధ్యతరగతి ప్రజలకు ప్రధాన రవాణా మార్గం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం డ్రైవర్ల కష్టాలను , ప్రయాణికుల ఆర్థిక స్థితిని బేరీజు వేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా వేలాది మంది దైనందిన ప్రయాణాలపై పడుతుంది. మరి ప్రభుత్వం డ్రైవర్ల డిమాండ్కు తలొగ్గుతుందో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications