ఆర్బీఐ వడ్డీ రేటు ఎఫెక్ట్, రూ.6.9 లక్షల కోట్ల సంపద ఆవిరి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4 శాతం నుండి 4.4 శాతానికి పెరిగింది. దీంతో హోమ్ లోన్, వెహికిల్ లోన్ తదితర రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి, ఈఎంఐ భారంగా మారుతుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1300 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో చాలా రోజులకు 55,700 పాయింట్ల దిగువకు వచ్చి, రెండు నెలల కనిష్టానికి పడిపోయింది. మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు.
రూ.6.9 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతం కంటే పైగా నష్టపోయాయి. నిన్న 825 షేర్లు లాభాల్లో ముగియగా, 2454 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 98 షేర్లలో మాత్రం ఎలాంటి మార్పులేదు. దీంతో ఇన్వెస్టర్లు నిన్న ఒక్కరోజు రూ.6.9 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.259 లక్షల కోట్లకు తగ్గింది. ఓఎన్జీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్టీపీసీ, కొటక్ మహీంద్రా బ్యాంకు మాత్రమే లాభపడ్డాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, పవర్, మెటల్, రియాల్టీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఒక శాతం నుండి మూడు శాతం క్షీణించాయి.
నష్టాల్లో...
త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపచడంతో టైటాన్ షేర్లు 4.11 శాతం నష్టంతో రూ.2288 వద్ద ముగిసింది. బలహీన ఫలితాల నేపథ్యంలో హీరో మోటో కార్ప్ షేర్ 2.27 శాతం నష్టపోయి రూ.2430 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో 27 షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంకులు 4 శాతం నుండి ఆ పైన నష్టపోయాయి. HDFC బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, రిలయన్స్, ఏషియన్ పేయింట్స్ 3 శాతం నుండి 4 శాతం మేర నష్టపోయాయి.
అందుకే మార్కెట్ పతనం
ఆర్బీఐ వడ్డీ రేటు పెంపుతో పాటు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుండటం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు తదితర అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ మానిటరీ కమిటీ చేపట్టిన చర్య సబబే అయితే, హఠాత్తుగా ప్రకటించడం షాక్ ఇచ్చిందని అంటున్నారు. ఆర్బీఐ తొలుత ద్రవ్యోల్బణాన్ని తక్కువగా అంచనా వేసిందని, ద్రవ్య విధానాన్ని మార్పుచేయడంలో వెనుబడిందని చెబుతున్నారు.