కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు విధానం మరో ఏడాదిలోపు పూర్తిగా రద్దు చేయబడుతుందని, దాని స్థానంలో పూర్తిస్థాయి బారియర్లెస్ ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ తీసుకువస్తామని ఆయన లోక్సభలో వెల్లడించారు. దేశంలోని హైవేలను ఉపయోగించే ప్రజలకు ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదని గడ్కరీ స్పష్టం చేశారు.
లోక్సభ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఉన్న టోల్ బూత్ వ్యవస్థ త్వరలో ముగుస్తుంది. టోల్ పే చేయడానికి ఎక్కడా బారియర్లు ఉండవు. ఎవ్వరూ మీ వాహనాన్ని ఆపరు. ఒక సంవత్సరంలోపు, దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ టోల్ వ్యవస్థ అమలు అవుతుందని తెలిపారు. ప్రయాణికులు అనవసరంగా ట్రాఫిక్లో నిలిచిపోవడాన్ని పూర్తిగా తగ్గించడమే కేంద్రం లక్ష్యమని ఆయన చెప్పారు.

కొత్త టోల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 ప్రదేశాల్లో అమలు చేస్తున్నట్లు గడ్కరీ వివరించారు. ఇది నేషనల్ హైవేల అభివృద్ధిలో అత్యంత కీలకమైన ముందడుగుగా ఆయన పేర్కొన్నారు. హైవే ప్రాజెక్టుల విషయంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని తెలిపారు. ఇది భారత రహదారి మౌలిక వసతుల అభివృద్ధి వేగాన్ని సూచిస్తుందని అన్నారు.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న NETC (National Electronic Toll Collection) వ్యవస్థ, దేశంలో టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. NETC ప్రోగ్రామ్లో ప్రధాన పాత్ర FASTag పరికరానికి ఉంటుంది. ఇది వాహన విండ్స్క్రీన్కు అమర్చబడే RFID ఆధారిత స్మార్ట్ ట్యాగ్. FASTag వాహనం టోల్ ప్లాజా వద్ద ఆగకుండా గేటును దాటుతున్నప్పుడు, వాహనదారుడి బ్యాంక్ ఖాతా నుండి టోల్ రుసుము ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది.
అయితే గడ్కరీ వివరణ ప్రకారం కొత్తగా ప్రవేశపెట్టనున్న వ్యవస్థ FASTagను మరో స్థాయికి తీసుకెళ్తుంది. మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టెక్నాలజీ ఆధారంగా ఉండే ఈ వ్యవస్థలో టోల్ బూత్లు పూర్తిగా తొలగించబడతాయి, వాహనం నిర్దిష్ట హైవే మార్గంలో ఎంత దూరం ప్రయాణిస్తే, దానికి అనుగుణంగా రియల్టైమ్లో టోల్ లెక్కించి వసూలు చేస్తారు. ANPR (Automatic Number Plate Recognition) కెమెరాలు వాహన నంబర్ ప్లేట్ను రికార్డు చేసి, టోల్ మొత్తాన్ని స్వయంచాలకంగా కట్ చేస్తాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ, ఇంధన వృథా, కాలదోషం తగ్గించి, స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ వైపు భారత్ అడుగులు వేస్తోంది.
ఈ సంస్కరణతో గంటల సమయం, వెయిటింగ్ లక్షల లీటర్ల ఇంధన వినియోగం ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రవాణా సామర్థ్యం పెరగడంతో పాటు లాజిస్టిక్స్ రంగంలో కూడా ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.భారత రహదారి రవాణా రంగంలో పెద్ద మార్పుకు రూపురేఖలు సిద్దమవుతుండగా, ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే భారత్ ప్రపంచంలో అత్యాధునిక హైవే టోల్ వ్యవస్థ కలిగిన దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications