షేర్లలో బ్యాంకుల పెట్టుబడులు ఎంత పెరిగాయంటే? కారణమిదే
ఆగస్ట్ 13వ తేదీతో ముగిసిన పక్షంలో బ్యాంకులు... షేర్లలో పెట్టుబడులను 25.6 శాతానికి పెంచుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐపీవోలలో చురుగ్గా పాల్గొనడం, రుణాలను ఈక్విటీగా మార్చుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఆగస్ట్ 13వ తేదీ వరకుషేర్లలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మొత్తం పెట్టుబడులు రూ.1.08 లక్షల కోట్లకు పెరిగాయి. జులై 30వ తేదీతో ఇవి రూ.86,233.8 కోట్లుగా ఉన్నాయి. జులై 16వ తేదీ నాటికి ఇవి రూ.85,967 కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం రూ.89,427 కోట్లుగా నమోదయ్యాయి.
షేర్లలో ఎక్కువ ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి బ్యాంకుల పెట్టుబడుల్లో సహజంగా భారీ మార్పులు ఉండవు. బాండ్స్, డిబెంచర్స్లో బ్యాంకుల పెట్టుబడులు అదే స్థాయిలో ఉన్నాయి. జూలై 30వ తేదీన రూ.5,78,498.2 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, ఆగస్ట్ 13వ తేదీ నాటికి రూ.5,78,186 కోట్లకు చేరుకున్నాయి.
కమర్షియల్ పేపర్స్ పెట్టుబడులు రూ.80,502 కోట్ల నుండి 4.46 శాతం వృద్ధితో రూ.84,094 కోట్లకు పెరిగాయి. ఆగస్ట్ 13వ తేదీతో ముగిసిన పక్షానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 4.86 శాతం పెరిగింది. బ్యాంకులు ఈక్విటీ డీల్స్ పైన అగ్రెసివ్గా ఉన్నాయి. ప్రధానంగా షేర్ ధరలు పెరగడం వృద్ధికి కలిసి వచ్చింది.