దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె.. ఈ తేదీల్లో పని ఉంటే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి..
దేశీయ బ్యాంకింగ్ రంగంలో మళ్లీ సమ్మె మేఘాలు కమ్ముకున్నాయి. బ్యాంక్ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 5 రోజుల పని వారం (5-Day Work Week) అమలులో తీవ్ర ఆలస్యం కావడంతో బ్యాంక్ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన సవరించిన పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) విధానంపై బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఉద్యోగుల ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాడుతున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)కి సమ్మె నోటీసు జారీ చేసింది.
సమ్మె ఎప్పుడంటే..
సెప్టెంబర్ 11 శుక్రవారం దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. అనంతరం సెప్టెంబర్ 12 రెండో శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 13 ఆదివారం కావడంతో వారాంతపు సెలవు ఉంటుంది. ఇక సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకు శాఖలకు సెలవు ఉండే అవకాశం ఉంది. దీంతో సమ్మె విజయవంతమైతే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకు శాఖల సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

ఇక తమ డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28 నుంచి మరో మూడు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించాయి. సెప్టెంబర్ 30తో ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం ముగుస్తుంది. ఈ సమయంలో బ్యాంకింగ్ రంగంలో లావాదేవీలు, ఖాతాల పరిశీలన, ఇతర ఆర్థిక కార్యకలాపాలు కీలకంగా ఉంటాయి. అలాంటి సమయంలో సమ్మె జరగడం వల్ల బ్యాంకుల సాధారణ కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్లో నిర్వహించే సమ్మెల తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించినట్లు తెలుస్తోంది.
అయితే సమ్మె జరిగే తేదీల్లో ఏయే బ్యాంకు సేవలు పూర్తిగా ప్రభావితమవుతాయనే విషయం సంబంధిత యూనియన్లు, బ్యాంకు యాజమాన్యాలు విడుదల చేసే అధికారిక ప్రకటనలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాంకు శాఖలు మూసివేసినా యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
సమ్మెకు కారణాలు ఏంటంటే..
మార్చి 2024లో సంతకం చేసిన 12వ ద్విపక్ష ఒప్పందం, 9వ జాయింట్ నోట్ నిబంధనల ప్రకారం.. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ పని వేళలను 40 నిమిషాలు పెంచడం ద్వారా శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించడానికి ఐబీఏ అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేసి రెండేళ్లకు పైగా గడుస్తున్నప్పటికీ.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా తుది ఆమోదం లభించకపోవడంపై యుఎఫ్బీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరంతరం తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఐదు రోజుల పని వారం తక్షణమే వర్తింపజేయాలని యూనియన్లు డిమాండ్ చేశాయి.
ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ (DFS) ఇటీవలే జారీ చేసిన నూతన పీఎల్ఐ సర్క్యులర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. స్కేల్ IV, అంతకంటే పై స్థాయి ఉన్నతాధికారులకు వారి వ్యక్తిగత పనితీరు (Personal Performance) ఆధారంగా ఏకంగా 365 రోజుల బేసిక్ పే వరకు విపరీతమైన పీఎల్ఐ చెల్లిస్తుండగా.. వర్క్మెన్ ఉద్యోగులకు, స్కేల్ III వరకు ఉన్న అధికారులకు మాత్రం గరిష్టంగా కేవలం 15 రోజుల బేసిక్ పే+డీఏకి మాత్రమే పరిమితం చేశారు.
ఈ విధానం తీవ్ర వివక్షాపూరితమైనదని, ఐబీఏతో కుదిరిన ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని యూనియన్లు ఆరోపించాయి. పీఎల్ఐ అనేది మొత్తం బ్యాంక్ సాధించిన ఆర్థిక సమగ్ర ఫలితాల ఆధారంగా ఉండాలని.. స్కేల్ VII వరకు ఉన్న ఉద్యోగులందరికీ సమాన నిష్పత్తిలో రోజులను వర్తింపజేయాలని స్పష్టం చేశాయి. ఈ పీఎల్ఐ వివాదం ప్రస్తుతం చీఫ్ లేబర్ కమిషనర్ (CLC) వద్ద రాజీ ప్రక్రియలో ఉండటంతో పాటు ఢిల్లీ హైకోర్టులో కూడా విచారణలో ఉంద ని తెలిపారు.
ఈ ప్రధాన డిమాండ్లతో పాటు పెన్షన్ అప్డేషన్, పెన్షనర్లందరికీ ఏకరీతి డీఏ విధానం, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ (OPS)లోకి మారే అవకాశం వంటి మిగిలిన కీలక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యుఎఫ్బీయూ ఒత్తిడి తెచ్చింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులలో చేపట్టే మార్కెట్-కేంద్రీకృత పునర్నిర్మాణాన్ని విరమించుకుని.. చిన్న డిపాజిటర్ల పొదుపుపై ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే సరసమైన వడ్డీ రాబడులను అందించాలని యూనియన్లు కోరాయి. అలాగే, స్థానిక బ్యాంక్ శాఖల ద్వారానే చిన్న రుణాలు పొందే అవకాశాన్ని విస్తరించి ప్రజా సంక్షేమ బ్యాంకింగ్ను నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశాయి.


Click it and Unblock the Notifications
