BOB World APP Row: దేశీయ ప్రభుత్వ యాజమాన్యంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా బ్యాంక్ ఆఫ్ బరోడా కొనసాగుతోంది. తాజాగా ఈ సంస్థలో డబ్బుల గోల్ మాల్ వ్యవహారం బయటకు రావటంతో రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
తాజాగా BOB World APP అక్రమాల వ్యవహారంలో బ్యాంక్ ఆఫ్ బరోడా 60 మందికి పైగా ఉద్యోగులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో 11 మంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఉన్నారు. BoB వరల్డ్ యాప్ కేసు సంచలనంగా మారిన వేళ షేర్లు బుధవారం దాదాపు 1% క్షీణతతో రూ.205.35 వద్ద ట్రేడవుతున్నాయి. దీనికి ముందు రిజర్వ్ బ్యాంక్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడాను BoB వరల్డ్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను ఆన్బోర్డ్ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.

ఈ వ్యవహారంపై బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి మాట్లాడుతూ.. ఏజీఎం స్థాయి అధికారులు సాధారణంగా ఏరియా మేనేజర్లు, జోనల్ హెడ్ల పదవులను కలిగి ఉన్న స్కేల్ 5 అధికారులని తెలిపారు. 25కి పైగా శాఖల అధిపతుల పనిపై ఆయన నిఘా ఉంచినట్లు వెల్లడించారు. అంతర్గత ఆడిట్ ఆధారంగా తాజా చర్యలు వచ్చాయని ఆయన అన్నారు. కస్టమర్ల సమ్మతి లేకుండా వారి అకౌంట్ వివరాలు ఫీడ్ చేసి కొందరు ఉద్యోగులు BoB వరల్డ్ అప్లికేషన్ను రిజిస్టర్ చేసి డీరిజిస్టర్ చేశారు. దీంతో కొందరు ఖాతాదారులకు ఆర్థిక నష్టం వాటిల్లిందని తేలింది.
సస్పెండ్ అయిన వారిలో ఎక్కువ మంది గుజరాత్ వడోదర ప్రాంతానికి చెందిన వారేనని సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలోనే లఖ్నవూ, భోపాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో చర్యలు ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో తప్పుచేసినట్లు గుర్తించిన ఉద్యోగులను పూర్తిగా తొలగించటం లేదా ఇతర శిక్షలు వేయెుచ్చని తెలుస్తోంది. అలాగే నిర్దోషి అని తేలితే సస్పెన్షన్ కాలంలో నిలిపివేసిన జీతం తిరిగి చెల్లిస్తారని ఒక ఉద్యోగి వెల్లడించారు. అయితే ప్రస్తుతం బ్యాంక్ యాప్ లోని లోపాలను సరిచేయటంపై దృష్టి సారించింది. త్వరలోనే రిజర్వు బ్యాంక్ కు దీనిపై పూర్తి స్థాయి రెక్టిఫికేషన్ రిపోర్టు అందించే పనిలో ఉంది.


Click it and Unblock the Notifications