మారటోరియం ఉన్నప్పటికీ 90 రోజుల్లో రూ.5 లక్షల బీమా: నిర్మల
ఆర్థిక ఇబ్బందుల్లోని బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కల్పించింది. ఆర్బీఐ మారటోరియం విధించినప్పటికీ బ్యాంకు ఖాతాదారులకు కూడా డిపాజిట్ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు DICGC చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తాజా సవరణలతో DICGC ద్వారా 98.3 శాతం ఖాతాదారులు లబ్ధి పొందుతారన్నారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లో ఖాతాదారులు తమ డిపాజిట్ల పైన రూ.5లక్షల వరకు బీమా సౌకర్యం పొందవచ్చునని తెలిపారు.
ఆర్బీఐ యాజమాన్యంలోని DICGC బ్యాంకు డిపాజిటర్లకు ఈ బీమాను అందిస్తుంది. 2020లో ఈ బీమా మొత్తాన్ని రూ.లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచింది. అయితే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్స్ రద్దు చేసి, లిక్విడేషన్ చర్యలు ప్రారంభించిన తర్వాత DICGC నుండి బీమా మొత్తాన్ని పొందవచ్చు.
తాజాగా ఈ DICGC చట్టాన్ని సవరించడంతో దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నిధులను వెనక్కి తీసుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరంలేదు. బ్యాంకు నష్టాల్లో ఉండి సాధారణ కార్యకలాపాలపై ఆర్బీఐ తాత్కాలిక నిషేధం విధించినప్పుడు, ఖాతాలు స్తంభింపజేసినప్పుడు, రూ. 5లక్షల వరకు నిధులను బీమా ద్వారా పొందవచ్చు.