RBI అలా చేస్తే పరిష్కారం రాదు, బ్యాంకులపై పెనుభారం.. ఏళ్లు పడుతుంది
ముంబై: ఓవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణాల పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (S&P) నివేదిక ఆందోళన కలిగించేదిగా ఉంది. రుణాల పునర్వ్యవస్థీకరణ కేవలం ఎన్పీఏల గుర్తింపును మాత్రమే వాయిదా వేస్తుందని, కానీ సమస్యను పరిష్కరించేదిగా ఉండదని అభిప్రాయపడింది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా గత అంచనాలకు మించి రుణాదాతలపై ప్రభావం కనిపిస్తోందని, 2019-20లో 8.5 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2020-21 నాటికి 14 శాతానికి పెరుగుతాయని అంచనా వేసింది.
కరోనా మాస్క్: రూ.13వేలు జరిమానా కట్టిన ఆ ప్రధాని ఎవరంటే?
ఆర్బీఐ మరో అడుగు వల్ల..
కరోనా వల్ల భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ పుంజుకోవడానికి కొన్నేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని S&P అభిప్రాయపడింది. రుణాల పునర్వ్యవస్థీకరణతో ఎన్పీఏలు గుర్తించడం మాత్రమే వాయిదా పడుతుందని, సమస్య మాత్రం తీరదని తేల్చి చెప్పింది. గతంలో అంచనా వేసిన దాని కంటే బ్యాంకులపై కరోనా ప్రభావం భారీగానే ఉండవచ్చునని తెలిపింది. రుణాల మంజూరు నెమ్మదించి, తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారి తీస్తుందని పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినందున ఆర్బీఐ ప్రకటించిన ఈఎంఐ మారటోరియం సదుపాయాన్ని కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. దీని తర్వాత ఆర్బీఐ రుణాల పునర్ వ్యవస్థీకరణ వైపు అడుగులు వేస్తోంది. దీనిపై S&P స్పందించింది.
బ్యాంకులపై భారం.. ఎన్బీఎఫ్సీలపై మరింత ప్రభావం
ఆర్బీఐ రుణాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయం వల్ల సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడింది. నిరర్థక ఆస్తుల గుర్తింపు మాత్రమే వాయిదా పడుతుందని తెలిపింది. పైగా అలా చేస్తే బ్యాంకులపై వ్యయ భారం పెరుగుతుందని, మొండి బకాయిల వసూళ్లు బాగా పడిపోవడమే కాకుండా ఇవి మరింత పెరిగే ఆస్కారం ఉందని తెలిపింది. బ్యాంకులతో పోలిస్తే బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థలపై (NBFC) ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఈ రంగాల్లో మొండి బకాయిలు పెరగొచ్చు
రియల్ ఎస్టేట్, టెలికం, విద్యుత్ రంగాల్లో మొండి బకాయిలు పెరగవచ్చునని అంచనా వేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రుణాల చెల్లింపుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, అయితే ప్రభుత్వం ప్రకటించిన రుణ హామీ పథకం వీటికి కొంత మేలు చేస్తుందని పేర్కొంది. కానీ ఇప్పటికే కరోనా వల్ల ఎన్పీఏల పెరుగుదలకు కారణం కానుందని అభిప్రాయపడింది. బ్యాడ్ లోన్స్ దశాబ్దాల గరిష్టానికి చేరుకోవచ్చునని తెలిపింది.
వేల కోట్లు అవసరం
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.40,000 కోట్ల మూలధన సహాయం అవసరం కావొచ్చునని S&P తెలిపింది. లాక్ డౌన్లో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం, ఆర్థిక మాంద్యం వంటి అంశాలు బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర, దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయని పేర్కొంది.