బ్యాడ్ లోన్స్ రూ.10 లక్షలకు పెరిగే అవకాశం, ఎప్పటి వరకు అంటే
2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి బ్యాంకుల బ్యాడ్ లోన్స్ రూ.10 లక్షల కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ బాడీ అసోచామ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సంయుక్త స్టడీలో వెల్లడైంది. మార్చి 2022 నాటికి ఎన్పీఏలు 8.5 శాతం నుండి 9 శాతానికి చేరుకోవచ్చునని భావిస్తున్నారని, రిటైల్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్(MSME) అకౌంట్స్ స్లిప్పేజ్ కారణంగా కొన్ని పునర్నిర్మించిన ఆస్తులు ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. బ్యాంకులకు మొండి బకాయిలు గుదిబండలా మారుతున్నాయి. రిటైల్, ఎంఎస్ఎంఈ రంగాల్లో నిరర్థక ఆస్తులు అంతకంతకు పెరగడంతో వచ్చే మార్చి నాటికి ప్రధాన బ్యాంకుల ఎన్పీఏలు రూ.10 లక్షల కోట్లు దాటవచ్చునని చెబుతోంది.
బ్యాలెన్స్ షీట్స్ పటిష్టం
MSME ఖాతాలు మొండి బకాయిల జాబితాలోకి అధికంగా చేరుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. అలాగే కొన్ని ఆస్తుల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు తెలిపింది. బ్యాంకుల నిరర్థక ఆస్తుల పైన రీ-ఎన్ఫోర్సింగ్ ది కోడ్ పేరుతో సర్వే నిర్వహించారు. మార్చి 2022 నాటికి ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 8.5 శాతం నుంచి 9 శాతానికి పెరిగే అవకాశముంది. దీనికితోడు పునర్వ్యవస్థీకరించిన కొన్ని అకౌంట్స్ నుండి సైతం డిఫాల్ట్లు చోటు చేసుకునే అవకాశముంది. కొన్నేళ్ళ క్రితం మొండిబకాయిల అకౌంట్స్తో పోలిస్తే ప్రస్తుత ధోరణి భిన్నంగా ఉంది. గతంలో ఎన్పీఏలు బడా కార్పోరేట్లకు చెందినవిగా ఉండేవి. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు, రిటైల్ రంగాల్లో ఎన్పీఏలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద కంపెనీల కంటే ఈ విభాగాల్లో ఎన్పీఏల సమస్య ఎక్కువగా ఉండవచ్చు. అదే సమయంలో పెద్ద కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ పటిష్టంగా తయారయ్యాయి.
సవాలే.. గట్టెక్కేందుకు చర్యలు
పెరగనున్న ఎన్పీఏ సమస్యలు దివాలా కోడ్ పటిష్టత, సామర్థ్యాలను పరీక్ష అంటున్నారు. కరోనా సవాళ్ల నుండి గట్టెక్కించడానికి ప్రకటించిన పలు విధానపరమైన చర్యలు వెనక్కు తీసుకునే అవకాశం ఉండడంతో కంపెనీలు దివాలా సమస్యలు తీవ్రం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్తో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల స్థూల ఎన్పీఏలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2021-22లో పెరిగినప్పటికీ 2018 మార్చి నాటి తీవ్రత ఉండకపోవచ్చు. ఇందుకు ప్రభుత్వం నుండి వస్తున్న మద్దతు కారణం. కరోనా నేపథ్యంలో మారటోరియం, అత్యవసర రుణ హామీ, రుణ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను ప్రస్తావించవచ్చు.
బ్యాంకుల సామర్థ్యం
భారత బ్యాంకుల్లో రిస్క్ను తట్టుకొని నిలబడే సామర్థ్యం పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. గతంలో నిబంధనలు రుణదాతలకు అనుకూలంగా ఉండేవి కావని, ఇది ప్రమోటర్లు ఉద్దేశ్యపూర్వక మోసాలకు పాల్పడటానికి దోహదం చేసేవని, దీంతో అధిక సంఖ్యలో ఎగవేతదారులు తయారు అయ్యారని పేర్కొంది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారినట్లు పేర్కొంది.