బ్యాడ్ న్యూస్: బ్యాంకుల నెత్తిన రూ 30,000 కోట్ల భారం!
కొత్త సంవత్సరం మొదలైంది. 2020 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అయితే... భారతీయ బ్యాంకులకు మాత్రం బ్యాడ్ ఇయర్ కానుందా? అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు. ఈ ఏడాది మొదలవుతూనే సుమారు రూ 30,000 కోట్ల మొండి బకాయిల భారం బ్యాంకుల నెత్తిన పడనుంది. లోన్స్ పుచ్చుకున్న కంపెనీలు డిఫాల్ట్ అవటంతో ఇక బ్యాంకులు అంతంగా ఆ మేరకు ప్రొవిజన్స్ పెట్టుకోవాల్సిందే. అంటే రూ 30,000 కోట్ల భారాన్ని తమ భుజాలపై వేసుకోవాల్సిందే. దివాన్ హోసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డిహెచ్ఎఫ్ఎల్), అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, కాఫీ డే ఎంట్రప్రెస్స్, సీజ్ పవర్ కంపెనీలకు సంబంధించి ఈ మేరకు బకాయిలు పోగుపడ్డాయి. ఇందులో డిహెచ్ఎఫ్ఎల్ ఇప్పటికే డిసెంబర్ లో దివాళా ప్రక్రియ ప్రారంభించింది. బ్యాంకుల మొండి బకాయిల పెరుగుదలపై ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఒక కథనంలో ఈ విషయాన్నీ వెల్లడించింది.
ప్రభుత్వానికి భారీ ఊరట: ఏపీ-తెలంగాణ కలెక్షన్లు ఎంతంటే?
40% కట్టాల్సిందే...
దేశంలో అంతకంతకూ పేరుకుపోతున్న మొండి బకాయిలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ) స్పష్టమైన మార్గనిర్దేశకాలు ప్రకటించింది. వాటి ప్రకారం ఏదైనా ఒక కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సి ఎల్ టి ) కు దివాళా కొరకు ఆశ్రయించిందంటే... తప్పనిసరిగా ఆ కంపెనీ తీసుకున్న రుణాల మొత్తంలో 40% నిధులను బ్యాంకులు ప్రొవిజన్ గా నమోదు చేయాలి. దీని ప్రకారం చూస్తే ఎం పీ ఏ లుగా మారిన మొండి పద్దుల మొత్తం రూ 62,754 కోట్లకు చేరుకున్నాయి. దీంతో బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. అయితే, గత కొంత కాలంగా మొండి బకాయిల పై ఆర్బీఐ, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో ... మొత్తం ఎం పీ ఏ లు కొంత తగ్గుముఖం పట్టడటం విశేషం.
డి హెచ్ ఎఫ్ ఎల్ భారం రూ 25,000 కోట్లు...
మొత్తం ఎం పీ ఏ లుగా మారిన మొండిపద్దుల్లో సింహభాగం దివాన్ హోసింగ్ ఫైనాన్స్ దే కావటం గమనార్హం. ఈ ఒక్క సంస్థ అప్పులే రూ 25,000 కోట్ల మేరకు ఉన్నాయి. అదే సమయంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అప్పులు రూ 5,000 కోట్ల మేరకు పేరుకుపోయాయి. కాఫీ డే ఎంట్రప్రెస్స్ కు మరో రూ 4,970 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. సి జి పవర్ అనే కంపెనీ అప్పుల భారం మరో రూ 4,000 కోట్లుగా తేలింది. అయితే, దివాన్ హోసింగ్ ఫైనాన్స్ మినహా... మిగితా అన్ని కంపెనీలతో బ్యాంకులు పరిష్కార మార్గాలపై చర్చలు జరుపుతున్నాయి.
వోడాఫోన్ తో ఎస్బీఐ కి తలనొప్పి...
పీకల్లోతు కష్టాల్లో ఉన్న వోడాఫోన్ - ఐడియా కంపెనీ అప్పుల భారం కూడా బ్యాంకులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ కంపెనీకి దాదాపు రూ 1.17 లక్షల కోట్ల రుణ భారం ఉంది. ఎప్పుడు దివాళా తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వోడాఫోన్ -ఐడియాకు సుమారు రూ 12,000 కోట్ల రుణాలు మంజూరు చేసిన అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ బ్యాంకు ఎస్సార్ స్టీల్ కు కూడా భారీ మొత్తంలో రుణాలు ఇచ్చి ఇరుక్కు పోగా... ఇన్సోల్వన్సీ పిటిషన్ నమోదు చేయటంతో ఎస్సార్ స్టీల్ ను లక్ష్మి మిట్టల్ కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ కొనుగోలు చేయటం తో సుమారు రూ 12,160 కోట్లు వెనక్కి వచ్చాయి. కానీ అన్ని సందర్భాల్లో ఇలా జరిగే అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు.