అయోధ్య తీర్పు: మార్కెట్లకు మరింత ఉత్సాహం, కారణాలివే.. పెరగనున్న టూరిస్ట్లు
ముంబై: అయోధ్య భూమిపై శనివారం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఇప్పటి వరకు వివాదాస్పదంగా ఉన్న భూమిని న్యాస్ ట్రస్టుకు అప్పగించాలని చెప్పింది. తద్వారా అయోధ్య శ్రీరాముడిదేనని చెప్పింది. అదే సమయంలో మసీదు కోసం 5 ఏకరాల భూమిని ఇవ్వాలని సూచించింది. ఈ తీర్పును యావత్ భారత్ హర్షించింది. బాబ్రీ మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదని, దాని కింద ఓ నిర్మాణం ఉందని ఏఎస్ఐ నిర్ధారించిందని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ ప్రదేశం రాముడు జన్మస్థలమని హిందువుల విశ్వాసం అని చెప్పారు. ఈ తీర్పును అందరూ స్వాగతించారు. ఈ తీర్పు ప్రభావం మార్కెట్ల పైన కూడా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
'రూ.2000 నోట్లు రద్దు చేయండి, నగదు చెల్లింపుపై పన్నులు
ఈ తీర్పు ఇన్వెస్టర్ల నమ్మకం పెంచుతుంది
అయోధ్య తీర్పుపై మార్కెట్ నిపుణులు పాజిటివ్గా స్పందించారు. ఏళ్ల కొద్ది నలుగుతున్న ఈ వివాదం కొలిక్కి రావడం దేశ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ తీర్పుతో దేశంలోని ప్రధాన రాజకీయ, విధానపరమైన అనిశ్చితి ముగిసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం మరింతగా బలపడుతుందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.
దలాల్ స్ట్రీట్ దూసుకెళ్తుంది
నరేంద్ర మోడీ హయాంలో స్టాక్ మార్కెట్ల సూచీలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మందగమనంలోను సెన్సెక్స్ నిఫ్టీ కొన్నిసార్లు నష్టపోయినా.. ఎక్కువగా దూసుకెళ్తూ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తాజా తీర్పు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింత బలపడుతుందని, కొనుగోళ్లతో దలాల్ స్ట్రీట్ మరింత దూసుకుపోతుందని భావిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ది కీలక పాత్ర
భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందుకు ఉత్తర ప్రదేశ్ వాటా లక్ష కోట్ల డాలర్లుగా ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశానికి, యూపీకి మరెంతో కీలకమైన అయోధ్య తీర్పు వల్ల ఆ రాష్ట్రం ఇతర సమస్యలపై దృష్టి సారించేందుకు మరింత దోహదపడుతుందని ముంబైకి చెందిన ఇన్వెస్టర్ విజయ్ కేడియా అన్నారు.
ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుంది
వ్యవస్థను సరళతరం చేసే ఎలాంటి నిర్ణయమైనా భారత్ పైన విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుందని కేఆర్ చోక్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఎండీ దివాన్ చోక్సీ అన్నారు. ఇటీవల కాశ్మీర్ 370 ఆర్టికల్ తొలగింపు, ఇప్పుడు అయోధ్యం తీర్పు దేశీయ ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిదని, వ్యక్తిగత పన్ను రేట్లు మార్చడం వంటి సంస్కరణలు మరిన్ని వస్తాయని ఆర్థిక నిపుణులు సంజయ్ భాసిన్ అన్నారు. మార్కెట్లు బుల్లిష్గా ఉన్నాయని, బెంచ్ మార్క్ సూచీలు కొత్త గరిష్టాలకు చేరుకోవడం సులభం అన్నారు.
టూరిస్టులు పెరుగుతారు
ఈ తీర్పుతో అయోధ్యను సందర్శించి దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందని, కేడియా అన్నారు. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మార్చిన వైష్ణో దేవి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లానే అయోధ్య కూడా మారుతుందన్నారు. 50,000 నుంచి 1 లక్ష వరకు పర్యాటకులు పెరుగుతారన్నారు.