Axis Bank: కుప్పకూలిన యాక్సిస్ బ్యాంక్ షేర్.. అమెరికా సంస్థ నిర్ణయంతో భారీ పతనం..
Axis Bank: దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ షేర్లు డీలా పడ్డాయి. మార్కెట్లో మధ్యాహ్నం 1.03 గంటల సమయంలో షేర్లు 3.77 శాతం మేర నష్టపోయి రూ.871.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కేవలం ఉదయం నుంచి ఇప్పటి వరకు షేర్ ఏకంగా రూ.34.15 విలువను కోల్పోయింది.
పతనానికి కారణం..
అమెరికాలోని బోస్టర్ ఆధారిత బైన్ క్యాపిటల్ ఈ రోజు మార్కెట్లో బ్లాక్ డీల్ ద్వారా యాక్సిస్ బ్యాంక్లో 1.24% వాటాను విక్రయించింది. ఈ షేర్ల విక్రయ విలువ దాదాపు రూ.3,400 కోట్లుగా ఉందని సమాచారం. ఇందుకు ఫ్లోర్ ధర ఒక్కో షేరుకు రూ.888గా నిర్ణయించబడినట్లు తెలుస్తోంది. దీనికి ముందు సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి యాక్సిస్ బ్యాంక్ షేర్లు రూ.906 ధర వద్ద ముగిశాయి.
యాక్సిస్ బ్యాంక్..
బైన్ క్యాపిటల్ కు యాక్సిస్ బ్యాంక్లో సెప్టెంబర్ 30,2022 నాటికి దాని మూడు ఫండ్ల ద్వారా 4.24% వాటాను కలిగి ఉంది. BC Asia Investments VII, BC Asia Investments III, Integral Investments South Asia IV ఫండ్స్ కింద యాక్సిస్ బ్యాంక్ షేర్లను హోల్డ్ చేస్తోంది. యాక్సిస్ బ్యాంక్ మూలధన స్థావరాన్ని విస్తరించడంలో సహాయపడటానికి నవంబర్ 2017లో బోస్టన్కు చెందిన బైన్ ఒక ప్రైవేట్ రుణదాతలో రూ. 11,626 కోట్ల పెట్టుబడి పెట్టే ఒక కన్సార్టియానికి నాయకత్వం వహించింది.
షేర్ ప్రయాణం..
ఏడాది ప్రాతిపదికన 25.25 శాతం పెరిగింది. గడచిన ఆరునెలల్లోనే 20 శాతం రాబడిని అందించింది. అక్టోబర్ 27, 2022న ఈ షేరు 52 వారాల గరిష్ఠమైన రూ.920కి చేరుకుంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.618.25 గా ఉంది.