Axis Bank: కుప్పకూలుతున్న యాక్సిస్ బ్యాంక్ షేర్లు.. అసలు ఏమైంది..? ఇప్పుడే ఎందుకిలా..?
Axis Bank: ఇటీవలి కాలంలో ప్రైవేటు రంగం బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కంపెనీ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. కొద్ది రోజుల కిందట విదేశీ సంస్థ తన వాటాలను విక్రయించటంతో ఈ బ్యాంక్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అయితే తాజాగా ఇదే పరిస్థితి మళ్లీ ఎదురైంది.
ఈరోజు మార్కెట్లో..
యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఈరోజు కూడా భారీగానే నష్టపోయాయి. ఉదయం ప్రారంభమైన ట్రేడింగ్ సెషన్ లో ఎన్ఎస్ఈలో కంపెనీ టాప్ లూజర్ గా నిలిచింది. 10 గంటల సమయంలో కంపెనీ షేర్ విలువ రూ.848.20 వద్ద ఉంది. ఈ సమయానికి షేర్ దాదాపు 3 శాతం(26 రూపాయలు) విలువను కోల్పోయింది. ఈ రోజు ట్రేడింగ్ సమయంలో షేర్ గరిష్ఠంగా రూ.32 రూపాయలు విలును కోల్పోయి రూ.841 స్థాయిలను తాకింది.
కారణం ఏమిటంటే..
ఈరోజు మార్కెట్లో స్టాక్ నష్టాలకు కేంద్ర ప్రభుత్వం తన వాటాలను విక్రయించాలని ఆలోచనలో ఉండటమేనని వెల్లడైంది. యాక్సిస్ లో ప్రభుత్వం స్పెసిఫైడ్ అండర్టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కింద దాదాపు 1.55 శాతం వాటాను కలిగి ఉంది. అంటే మెుత్తం 4.65 కోట్ల షేర్లను కలిగి ఉంది. ఈ పెట్టుబడుల విలువ దాదాపు రూ.4,000 కోట్ల కంటే పైనే. ఒకవేళ ఇదేగనుక జరిగితే ప్రభుత్వం పూర్తిగా యాక్సిస్ బ్యాంక్ నుంచి వైదొలిగినట్లు అవుతుంది.
గతంలో ఢమాల్..
అమెరికాలోని బోస్టర్ ఆధారిత బైన్ క్యాపిటల్ ఈ రోజు మార్కెట్లో బ్లాక్ డీల్ ద్వారా యాక్సిస్ బ్యాంక్లో 1.24% వాటాను విక్రయించింది. ఈ షేర్ల విక్రయ విలువ దాదాపు రూ.3,400 కోట్లుగా ఉంది. నవంబర్ ఒకటిన ఈ ట్రాన్సాక్షన్ తర్వాత ఆరోజు మార్కెట్ క్లోజింగ్ సమయంలో యాక్సిస్ బ్యాంక్ షేర్లు రూ.871.75 ధర వద్ద ముగిశాయి. ఇది జరిగిన తర్వాత కొంత కోలుకున్న షేర్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మరోసారి పతన ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి.
ఆందోళనలో రిటైలర్లు..
వరుసగా కంపెనీ షేర్ల ధర పతనం కావటంపై ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా తమ సంపదను కోల్పోయారు. పదిరోజుల కాలంలో యాక్సిస్ బ్యాంక్ పెట్టుబడిదారుల్లో కలవరం మెుదలైంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.919.95 వద్ద ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.618.25గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.61 లక్షల కోట్లుగా ఉంది.