జాయింట్ వెంచర్ ప్లాన్ కు తెర దింపిన ఫోర్డ్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా .. కారణం ఇదే
కరోనా మహమ్మారి కారణంగా ప్రముఖ ఆటో రంగ దిగ్గజాలు ఫోర్డ్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా భాగస్వామ్య సంస్థ , జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలకు తెరదించినట్లుగా వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రెండు కంపెనీలు ఈ ఆలోచనను విరమించుకున్నట్లు గా స్పష్టం చేశాయి. జాయింట్ వెంచర్ విరమణపై రెండు కంపెనీలు వేరు వేరు ప్రకటనలు చేశాయి.
కరోనా ఎఫెక్ట్ .. భారతదేశంలో జాయింట్ వెంచర్ ఏర్పాటు లేనట్టే
కరోనా వల్ల వ్యాపార వాతావరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, జాయింట్ వెంచర్ వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆశించినంత ఫలితాలు ఉండకపోవచ్చని రెండు కంపెనీలు తమ ఆలోచనను విరమించుకున్నారు. భారతదేశంలో జాయింట్ వెంచర్ ఏర్పాటుకోసం ఏడాది కాలంగా ఫోర్డ్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రణాళికలు రచించాయి. మూడు కొత్త యుటిలిటీ వాహనాలను అభివృద్ధి చేయాలని భావించాయి.
రెండు సంస్థలు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను కుదుర్చుకునే లోపే కరోనా
వర్ధమాన మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలు సైతం రూపొందించాలని ప్రణాళికలు రచించాయి. అనుకున్నది ఒకటి అయితే అయ్యింది మాత్రం వేరేది. జాయింట్ వెంచర్ ఏర్పాటుకోసం ఉత్సాహం చూపించిన రెండు సంస్థలు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను కుదుర్చుకునే లోపే కరోనా కారణంగా ఏర్పడిన వ్యాపార ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు సంస్థలు వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది .ఒక ఏడాదిగా రచించిన ప్రణాళికలకు చివరకు స్వస్తి పలికాయి రెండు కంపెనీలు .
ఎవరి వ్యాపారం వారిదే
ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ఆటో మార్కెట్లో వృద్ధి చెందడానికి రెండు దశాబ్దాలకు పైగా కష్టపడుతున్నందున భారతదేశంలో ఫోర్డ్ వ్యాపారం యొక్క భవిష్యత్తు అస్పష్టంగా ఉంది. కంపెనీ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాలను చురుకుగా అంచనా వేస్తోంది అని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఫోర్డ్ తో వెంచర్ రద్దు దాని ఉత్పత్తి ప్రణాళికలను ప్రభావితం చేయదని మహీంద్రా తన సొంత ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ ఎస్యూవీల్లో నాయకత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలను మహీంద్రా వేగవంతం చేస్తోందని తెలిపింది.