adani: అక్కడి ప్రభుత్వ ఉద్యోగులూ అదానీ సంక్షోభం బాధితులే..
adani: హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక బయటకు వచ్చిన అనంతరం అదానీ గ్రూపు కంపెనీలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశంలోని పెట్టుబడుదారులు లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయారు. ఇంటా, బయటా ఈ వ్యవహారం గురించి చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకుని కమిటీని నియమిస్తామని పేర్కొంది. తాజాగా మరో దేశమూ ఈ సంక్షోభం బాధితురాలేనంటూ 'ది గార్డియన్' పత్రిక ఓ నివేదిక విడుదల చేసింది.

ఆస్ట్రేలియా పెట్టుబడులకు భారీ దెబ్బ:
అదానీ గ్రూపు కంపెనీ స్టాక్స్ లో ఏర్పడిన క్షీణత వల్ల ఆస్ట్రేలియా ప్రజల రిటైర్మెంట్ పొదుపులు ప్రభావితం అయినట్లు ది గార్డియన్ నివేదించింది. అవి అదానీ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో భారీగా నష్టపోయాయని వెల్లడించింది. ముఖ్యంగా క్వీన్స్ లాండ్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కామన్ వెల్త్ బ్యాంకు సిబ్బందికి సంబంధించిన ఫండ్ పై ఎక్కువ ప్రభావం చూపినట్లు పేర్కొంది.

మంచి పేరుండటంతో..
ఆస్ట్రేలియాలోని కార్మైకేల్ బొగ్గు గనితో పాటు అబాట్ పాయింట్ పోర్ట్ ను అదానీ గ్రూపు నిర్వహిస్తోంది. ఈ కారణంగా అక్కడ ఈ కంపెనీలకు మంచి పేరుంది. ఆయా సంస్థలు సైతం వేగంగా వృద్ధి చెందుతుండటంతో అనేక సూపర్ యాన్యుయేషన్ ఫండ్ లు వీటిలో చురుకుగా పెట్టుబడులు పెట్టాయి. కామన్వెల్త్ బ్యాంకు దీర్ఘకాలిక ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి 243 బిలియన్ డాలర్లతో.. ఓ ఫ్యూచర్ ఫండ్ ను ఆస్ట్రేలియా ఏర్పాటు చేసింది. అదానీ గ్రూపులోని రెండు కంపెనీల్లో అది పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది. ఇన్వెస్ట్ మెంట్ తో పోలిస్తే ప్రస్తుత స్టాక్ విలువ దారుణంగా పడిపోయింది.

నార్వే బయటపడింది కానీ..
బ్రిస్బేన్ కు చెందిన ఆస్ట్రేలియన్ రిటైర్మెంట్ ట్రస్ట్ కు 200 బిలియన్ డాలర్ల ఆస్తులున్నాయి. అది కూడా అదానీ గ్రూపులోని దాదాపు 6 కంపెనీల్లో లక్షలాది డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది. హెల్త్, కమ్యూనిటీ సర్వీస్ వర్కర్లకు సేవలందించే 70 బిలియన్ డాలర్ల విలువైన హెస్టా ఫండ్ కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసినట్లు గార్డియన్ పేర్కొంది. నార్వేకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ కు సైతం పెద్ద ఎత్తున ఈ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. కానీ హిండెన్ బర్గ్ నివేదిక వెలువడే కొంత కాలానికి ముందే.. తన మొత్తం వాటాలను విక్రయించి బయటపడింది.

తగినన్ని క్యాష్ ఫ్లోలు:
ఈ ఏడాది జనవరి 24 నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ ఏకంగా 134 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. షేర్ల అమ్మకాలు ఎక్కువ కావడంతతో మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్ల మార్క్ దిగువకు పడిపోయింది. ఒక నెలలోనే అదానీ స్టాక్స్ వాటి విలువలో 60 శాతం మేర నష్టపోయాయి. అయితే రుణాలను ముందుగా చెల్లించడం ద్వారా పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. అప్పులను తీర్చడానికి అవసరమైన క్యాష్ ఫ్లోలు తమ వద్ద ఉన్నాయని, లోన్స్ మెచ్యూరిటీ సమయం సైతం దగ్గరలో లేదని ప్రకటించింది.


Click it and Unblock the Notifications