ATM cash withdrawal fee: ఏటీఎం 'లిమిట్' దాటితే మరింత భారం, ఛార్జీ పెంపు
ముంబై: ఏటీఎం నుండి పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేసేవారికి షాక్. ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నారు. ఆయా బ్యాంకుకు చెందిన ఏటీఎం నుండి నగదును ఉపసంహరించుకుంటే పరిమిత ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఆ తర్వాత మాత్రం ఛార్జీ వసూలు చేస్తారు. ఈ ఛార్జీని పెంచుతున్నారు. అంటే నిర్ణీత ఉచిత ట్రాన్సాక్షన్స్కు మించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ పైన నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నాయి బ్యాంకులు. ఈ మేరకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంత వసూలు చేస్తారు?
ఉచిత పరిమితికి మించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్కు కస్టమర్ నుండి రూ.21 వసూలు చేయనున్నాయి బ్యాంకులు. ఈ మేరకు బ్యాంకులకు అనుమతిస్తూ ఆర్బీఐ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులు, ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం నుండి ప్రతి నెల 5 ఉచిత ఆర్థిక, ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్ను నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి మెట్రో నగరాల్లో అయితే మూడు, నాన్ మెట్రో నగరాల్లో అయితే ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ వరకు పరిమితి ఉంది. ఇవి మించితే ప్రస్తుతం ఒక్కో ట్రాన్సాక్షన్ పైన రూ.20 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని రూ.21కి పెంచారు. బ్యాంకులకు రూ.1 పెంచేందుకు ఆర్బీఐ అనుమతించింది.
ఎప్పటి నుండి అమలు
ఈ కొత్త నిబంధన వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 1వ తేదీ నుండి అమలులోకి రానుంది. కస్టమర్లు తమ బ్యాంకు ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎం నుండి గతంలో వలె ఐదు ఉచిత ఆర్థిక, ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చునని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే ఇతర బ్యాంకుల నుండి మెట్రో నగరాల్లో మూడు ఉచిత ట్రాన్సాక్షన్స్, నాన్ మెట్రో నగరాల్లో ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చునని తెలిపింది.
అందుకే ఈ పెంపు
ఏటీఎం కార్యకలాపాల కోసం ఖర్చులు పెరగడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోని ఆర్బీఐ బ్యాంకులకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ఏటీఎం ట్రాన్సాక్షన్స్కు సంబంధించి హయ్యర్ ఇంటర్చేంజ్ ఫీజును ఆర్థిక కార్యకలాపాలకు రూ.15 నుండి రూ.17కు, ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్కు రూ.5 నుండి రూ.6కు పెంచారు. ఈ ఇతర బ్యాంకు ఖాతాదారుల నుండి వసూలు చేసే ఇంటర్చేంజ్ ఫీజును ఆర్బీఐ ఆగస్ట్ నుండి పెంచుతోంది.