అక్కడ మా వాళ్ల ప్రాణాలు పోతున్నాయి.. చూస్తూ ఊరుకోవాలా.. G7లో ప్రధాని మోదీ కీలక హెచ్చరిక..
ఫ్రాన్స్లోని ఎవియాన్-లే-బెయిన్స్ (Évian-les-Bains) నగరంలో జరిగిన జీ7 (G7) సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రసంగించారు. అంతకంతకూ పరస్పర అనుసంధానంగా మారుతూ.. అదే సమయంలో అనిశ్చితిని ఎదుర్కొంటున్న ప్రస్తుత ప్రపంచంలో దేశాల మధ్య విశ్వాసం, పారదర్శకతను పెంపొందించడం అత్యవసరమని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
ముఖ్యంగా అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాల్లో ఎదురవుతున్న అంతరాయాలపై ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న నావికుల (Seafarers) భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన ఆయన.. ఇటీవల జరిగిన వివిధ సంఘర్షణల్లో పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ప్రస్తావించారు. అమెరికా నౌకపై జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పశ్చిమ ఆసియా (Middle East) ప్రాంతంలో శాంతి పునరుద్ధరణ కోసం జరుగుతున్న తాజా ప్రయత్నాలను భారతదేశం స్వాగతిస్తోందని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ సుదీర్ఘ సంఘర్షణ కారణంగా పశ్చిమ ఆసియాలోని మన మిత్ర దేశాలు తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో సముద్ర వాణిజ్యానికి అంతరాయం కలగడం వల్ల యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అంతేకాకుండా, ఈ సంక్షోభ పరిస్థితుల వల్ల భారతదేశానికి చెందిన ఎంతో మంది పౌరులు తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడటం, సముద్ర కార్మికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ విధులను నిర్వర్తించేలా అనుకూల వాతావరణాన్ని కల్పించడం ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ సముద్ర వాణిజ్యం ద్వారా అన్ని దేశాలను అనుసంధానించే నావికుల భద్రతను మనం విస్మరించకూడదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న పరస్పర సంబంధిత సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ప్రధాని గుర్తుచేశారు. "నేడు ఒక దేశం యొక్క ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, సైబర్ భద్రత మరియు ఆర్థిక శ్రేయస్సు అనేవి కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేవు. గ్లోబల్ మొబిలిటీ, డేటా, మూలధనం మరియు ఆధునిక సాంకేతికత మనందరినీ ఒకరితో ఒకరిని అనుసంధానిస్తున్నాయి" అని వివరించారు.
ఇలాంటి గ్లోబల్ వాతావరణంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ప్రాముఖ్యత సహజంగానే పెరుగుతుందని, అయితే ఆ భాగస్వామ్యాలు కేవలం పరస్పర నమ్మకంపై నిర్మించబడినప్పుడు మాత్రమే విజయవంతం అవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో... ప్రపంచ దేశాలకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తి (Strategic Asset) అనేది ఏదైనా ఒక ఖనిజం, సాంకేతికత లేదా పెద్ద మార్కెట్ మాత్రమే కాదని, దేశాల మధ్య ఉండే 'పరస్పర నమ్మకం' మాత్రమేనని ప్రధాని Modi స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications
