ఏపీలో రూ. 100 కోట్ల జాక్పాట్! చంద్రబాబు ఆఫర్కు ప్రపంచం షాక్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరోసారి తన విజనరీ నిర్ణయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు ఆయన క్వాంటమ్ (Quantum) టెక్నాలజీపై కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో పరిశోధనలు చేసి, క్వాంటం కంప్యూటింగ్ విభాగంలో నోబెల్ బహుమతి సాధించిన వారికి ఏకంగా రూ. 100 కోట్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలో మేధో సంపత్తిని గౌరవించడంతో పాటు.. ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలను ఇక్కడి నుంచే తయారు చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశ్యం.

క్వాంటం వ్యాలీగా అమరావతి
అమరావతిని ప్రపంచంలోని టాప్-5 క్వాంటం కంప్యూటింగ్ హబ్లలో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా 'క్వాంటం విజన్'ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో 'క్వాంటం వ్యాలీ'ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ ఎవరినీ అనుసరించదు.. అందరికీ మార్గదర్శిగా నిలుస్తుంది" అని నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే రెండేళ్లలో అమరావతి వేదికగా క్వాంటం కంప్యూటర్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించి 80 నుండి 85 శాతం భాగస్వామ్య సంస్థలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. న్యూరల్ ఆటమ్, ట్రాప్డ్ అయాన్, ఫోటోనిక్స్, టోపోలాజికల్ క్వాంటం కంప్యూటర్లను అభివృద్ధి చేయడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది.
ఐదు వేల మంది రిజిస్ట్రేషన్
సాంకేతికతతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు 'క్వాంటం స్కిల్లింగ్' ప్రోగ్రామ్ను ప్రారంభించారు. వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ STEM (WISER), క్యూబిటెక్ భాగస్వామ్యంతో ఈ శిక్షణ సాగుతోంది. ఇప్పటికే సుమారు 50,000 మంది విద్యార్థులు దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. కేవలం ఉద్యోగాలు చేయడం మాత్రమే కాదు, కొత్త ఆవిష్కరణలు చేసి ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది యువతకు కేవలం ఉద్యోగావకాశాలే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే వేదికగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నేషనల్ క్వాంటం మిషన్
నేషనల్ క్వాంటం మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 కోట్లు కేటాయించిందని.. ఈ అవకాశాన్ని ఏపీ అందిపుచ్చుకోవాలని నాయుడు ఆకాంక్షించారు. క్వాంటం కంప్యూటింగ్ ద్వారా పర్సనలైజ్డ్ మెడిసిన్, విద్యుత్ ధరల నియంత్రణ, స్థిరమైన వ్యవసాయం, వాతావరణ అంచనా వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన వివరించారు. ఈ ప్రయాణంలో కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రైవేట్ భాగస్వాములు, అకడమిక్ ఇన్స్టిట్యూషన్లు కూడా కలిసి పనిచేయాలని కోరారు. ముఖ్యంగా డీప్-టెక్ స్టార్టప్లను అమరావతికి రప్పించడం ద్వారా ఇక్కడ ఒక బలమైన ఎకో-సిస్టమ్ నిర్మించాలన్నది ఆయన ఆలోచన.
భవిష్యత్తుకు బాటలు!
చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రకటించిన ఈ క్వాంటం విజన్ ఆంధ్రప్రదేశ్ను డీప్-టెక్ ఎకానమీలో గ్లోబల్ లీడర్గా మార్చే అవకాశం ఉంది. రూ. 100 కోట్ల బహుమతి కేవలం ఒక ప్రోత్సాహం మాత్రమే కాదు.. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి పరిశోధనలకు అది ఒక పెద్ద ప్రేరణ. భారతదేశం ఇప్పటివరకు క్వాంటం రంగంలో సుమారు 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే చూసిందని, కానీ ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు ఈ రంగంలోకి మరిన్ని భారీ పెట్టుబడులను ఆకర్షిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications


