ప్యాకేజీ: ఆదాయపు పన్ను ప్రయోజనాలు, ఫోన్ల ధర తగ్గింపు... కేంద్రం ఏం ప్రకటన చేయవచ్చు?
త్వరలో మరో ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు ఇటీవల వెల్లడించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా అవసరమైతే ప్యాకేజీ ఉంటుందని సంకేతాలు ఇచ్చారు ఇప్పుడిప్పుడు ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని త్వరలో ప్రకటించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కేంద్రం ఇదివరకే రూ.21 లక్షల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. డిమాండ్ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫర్లు ఇచ్చింది. ఎంఎస్ఎంఈలకు, వీధి వ్యాపారులకు ఊరట కల్పించే ప్రకటనలు చేసింది. ఈ నేపథ్యంలో తాజా ప్యాకేజీపై అందరి దృష్టి పడింది.
పండుగ సీజన్లో 65% బంగారం వ్యాపారం, ధర కలిసి వస్తోంది..
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది.. కానీ
లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. లాక్ డౌన్ సమయంలో ప్రకటించిన భారీ ప్యాకేజీ, ప్రయోజనాలు దాదాపు ముగిశాయి. దీంతో రెండో ప్యాకేజీ అవసరమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వ్యాపార విశ్వాశాలు ఇంకా అస్థిరంగా ఉన్నాయని చెబుతున్నారు.
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన ఎల్టీసీ, బోనస్.. డిమాండ్ పునరత్తేజానికి అతి స్వల్పంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇప్పటికే పండుగ సీజన్ వచ్చింది. వ్యాపారులు దసరా, దీపావళిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు డిమాండ్ పెరిగినా, ఆ తర్వాత తగ్గుతుందని ఆందోళనలు ఉన్నాయి. పండుగ తర్వాత మళ్లీ డిమాండ్-లేమి కనిపించవచ్చునని చెబుతున్నారు.
భారీ పతనం.. ప్రభుత్వం ఏం చేయవచ్చు
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ భారీగా పతనం కానుందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేశాయి. మైనస్ 11.5 శాతంగా ఉంటుందని మూడీస్, మైనస్ 10.5 శాతంగా ఉంటుందని ఫిచ్, మైనస్ 10.3 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్, మైనస్ 9.3 శాతంగా ఉంటుందని వరల్డ్ బ్యాంక్, మైనస్ 9.5 శాతంగా ఉండవచ్చునని ఆర్బీఐ, మైనస్ 9 శాతంగా ఉండవచ్చునని ఎస్ అండ్ పీ అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి ఉద్దీపనలు ఏమి ఉండవచ్చుననే చర్చ సాగుతోంది.
మార్చి 2021 వరకు ఉచిత రేషన్ అందించే అవకాశాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
నగర పేదలకు మద్దతుగా ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
డిమాండ్ పెంచే లక్ష్యంలో భాగంగా ఆదాయపు పన్ను ప్రయోజనాలు కల్పించవచ్చునని చెబుతున్నారు.
మొబైల్ ఫోన్లు, సిమెంట్, వెహికిల్, వీటి ఈ ఉత్పత్తుల విడిభాగాలపై జీఎస్టీని తగ్గించవచ్చు.
షార్ట్ వ్యాలిడిటీ పీరియడ్తో నాన్ రీఫండబుల్ కన్సంప్షన్ వోచర్ జారీ చేయవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ప్రభుత్వం ముందు సవాళ్లు.. ఐనా.. చేయాలి
ప్రభుత్వం భారీ ఉద్దీపనలు ప్రకటించేందుకు పలు అడ్డంకులు ఉన్నాయి. ఆర్థిక పరిమితులు, వనరుల కొరత, కరోనా వేవ్, హైలెవ్ డెబిట్, ఉద్దీపన కోసం ఎక్కువ అప్పులు చేస్తే రేటింగ్ తగ్గుతుంది. ఇలా పలు అడ్డంకులు ఉన్నాయి.
అయితే ఇప్పుడు లోటు గురించి ఆందోళన చెందాల్సిన సమయం కాదని, తిరోగమనం సమయంలో ఆర్థిక విస్తరణ అవసరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. బలహీనమైన వినియోగ-వ్యాపార సెంటిమెంట్ ఉందని, దీనిపై దృష్టి సారించాలని చెబుతున్నారు. అలా అయితే వృద్ధి పుంజుకున్న తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోందని అంటున్నారు. రేటింగ్ ఏజెన్సీలు పునరుద్ధరణ ప్రణాళికలపై ఎక్కువ దృష్టి సారిస్తాయని అంటున్నారు.