రెండు నెలల్లో వడ్డీ రేటు మరో 75 బేసిస్ పాయింట్లు పెంచే ఛాన్స్
కరోనా తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్భణాన్ని అదుపులో పెట్టడానికి కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. మే, జూలై... ఈ రెండు నెలల్లో కీలక రెపో రేటును ఆర్బీఐ రెండు దఫాలుగా 90 బేసిస్ పాయింట్లు లేదా 0.90 శాతం పెంచింది. దీంతో బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను, రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేటు పెంపు మున్ముందు కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వచ్చే రెండు నెలల నుండి రెండున్నర నెలల కాలంలో ఆర్బీఐ మరో 75 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును పెంచే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ రేటు మరింత పెరుగుతుందని, దాదాపు మరో ఒక్క శాతం పెరగవచ్చునని చెబుతున్నారు. ఆర్బీఐ రెపో రేటును 4 శాతం నుండి 4.90 శాతానికి పెంెచింది. ఇది మున్ముందు 5.50 శాతం నుండి 6 శాతం స్థాయికి చేరుకోవచ్చునని అంటున్నారు.
ఇప్పటికే వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయని, పెంచుతున్నాయని, ఆర్బీఐ తదుపరి రేటు పెంపుకు అనుగుణంగా పెంచినప్పటికీ మరికాస్త మాత్రమే పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే భారీగా పెంచినందున, ఆర్బీఐ తదుపరి రెపో రేటు పెంపు ప్రభావం రుణగ్రహీతలపై కాస్త తక్కువగా ఉంటుందని అంటున్నారు.