Mahindra: లిథియం నిల్వలు కనుగొనడం కంటే కీలకం మరొకటుంది : ఆనంద్ మహీంద్రా ట్వీట్
Mahindra: ఇటీవల జమ్మూ-కశ్మీర్ లో బయటపడిన లిథియం నిల్వలను చూసి భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ వార్త బయటకొచ్చిన మరుక్షణం నుంచి అంతర్జాతీయంగా తీవ్ర అలజడి చెలరేగింది. కొన్ని దేశాల పాలకులైతే ఓ అడుగు ముందుకేసి, ఇండియాతో డీల్ కుదుర్చుకోవడానికి సైతం మంతనాలు జరిపారు. అయితే రాజస్థాన్ నుంచి మరో లడ్డూ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. దీనిపై బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో స్పందించారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పారిశ్రామిక ద్గిగజం ఆనంద్ మహీంద్రా. రాజస్థాన్ లో లిథియం నిల్వలను కనుగొనేందుకు శ్రమించిన పరిశోధకులు సహా ఇతర సిబ్బందిని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశంసించారు. కీలకమైన ఖనిజాన్ని శుద్ధిచేసే సామర్థ్యం సాధించే దిశగా త్వరగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

"21వ శతాబ్ధపు వృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్న సహజవనరులకు సంబంధించిన గణనీయమైన నిల్వలు మన వద్ద ఉన్నాయి. భారత్ ఉజ్వల భవిష్యత్తుకు ఇది నిదర్శనం. కానీ సరఫరా గొలుసులో కీలకమైన అంశం నిల్వలు కాదు, రిఫైనింగ్. ఈ విభాగంలో చైనా భారీ ఆధిపత్యం కలిగి ఉంది. ఆ సామర్థ్యాన్ని మన దేశంలో నెలకొల్పడానికి మనం త్వరగా అడుగులు వేయాలి" అని మహీంద్రా ట్వీట్ చేశారు.
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలోని దేగానాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) మరో లిథియం నిల్వలను కనుగొంది. గతంలో జమ్మూ-కశ్మీర్ లో లభించిన వాటి కంటే ఇవి మరింత పెద్దవి కావడం హర్షించదగ్గ విషయం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు సంబంధించి ఈ వెలికితీత ఓ గేమ్ ఛేంజర్ గా నిలుస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications