Mahindra: ప్రముఖ భారతీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. పలు సమస్యలు, వ్యక్తుల టాలెంట్స్ పై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ప్రజల్లో స్ఫూర్తి నింపుతుంటారు. గత ఆదివారం జరిగిన IPL మ్యాచ్ పై ఆయన భిన్నంగా స్పందించారు. రింకూ సింగ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఫోర్లు, సిక్స్ ల వర్షం కురవడం సాధారణమై పోయింది. అయితే ఏప్రిల్ 9 ఆదివారం నాడు కోల్ కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం అత్యద్భుతమనే చెప్పాలి. అందులో చోటుచేసుకున్న పరిణామాలపై ఆనంద్ మహీంద్రా పొగడకుండా ఉండలేకపోయారు. పాతికేళ్ల రింకూ సింగ్ చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి ప్రత్యర్థిని ఉతికి ఆరేయడంపై తనదైన శైలిలో స్పందించారు.

ఇందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా మహీంద్రా స్పందించారు. 'రింకూ సింగ్ అద్భుత ప్రతిభ, మ్యాచ్ విన్నింగ్ బ్యాటింగ్ శైలిపై స్పందించకుండా #MondayMotivation గురించి ఎలా మాట్లాడగలము. ఉత్కంఠభరితంగా సాగిన 'డూ ఆర్ డై' పరిస్థితుల్లో అతడేమి ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది. అంతటి ఆందోళనలోనూ ఆ విధంగా బంతితో ఆడుకునేంత మానసిక దృఢత్వం ఎక్కడిది? ఆ పవర్ మొత్తాన్ని ఓ బాటిల్ లో సీల్ చేసి రక్తంలోకి ఎక్కించుకోవాలి అనిపిస్తోంది' అంటూ తన మనసులోని భావాలను బయటపెట్టారు.
5 బంతుల్లో 5 సిక్సర్లు
ఆదివారం జరిగిన IPL మ్యాచ్లో రింకూ సింగ్ 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది తన జట్టును గెలిపించాడు. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 6 సిక్స్ లు, ఓ ఫోర్ తో కలిపి 21 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అయితే చివరి 7 బంతుల్లోనే 40 రన్స్ సాధించడం విశేషం. రింకూని ఆనంద్ మహీంద్రా ప్రశంసించిన అనంతరం పలువురు నెటిజన్లు అతడికి థార్ వాహనాన్ని బహుకరించాలని కోరారు.


Click it and Unblock the Notifications