Pakistan Crisis: పాకిస్థాన్కి దెబ్బ మీద దెబ్బ.. ప్రజల జేబులు ఖాళీ.. పాక్ రూపాయి విలవిల..
Pakistan Crisis: ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం ఆవేశం, రాజకీయ అనిశ్చితి వంటి కారణాలతో దాయాది పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఫారెక్స్ నిల్వలు వేగంగా తరిగిపోతున్న ఈ క్రమంలో పాకిస్థాన్ కొత్త సమస్యలను ఎదుర్కొంటోంది.
చరిత్రలో మెుదటిసారిగా పాకిస్థాన్ రూపాయి విలువ డాలర్తో పోల్చితే కొత్త కనిష్ఠాలకు జారుకుంది. ఈ విలువ 301కి చేరుకుంది. అంటే ఒక డాలర్ కొనుగోలు చేయాలంటే 301 పాకిస్థాన్ రూపాయలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒక డాలర్ ధర రూ.299గా నమోదైంది. దీనివల్ల దిగుమతులు మరింత ప్రియం కానున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ఖాళీ అవటంతో దేశం భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పాకిస్థాన్ దివాళా తీసినట్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది.
పాక్ వద్ద విదేశీ మారక నిల్వలు 4.5 బిలియన్ డాలర్లకు చేరుకోవటంతో అవి కేవలం ఒక నెల దిగుమతుల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయని తెలుస్తోంది. దీనివల్ల పాక్ నగదు కొరతతో సతమతమవుతోంది. దీనికి తోడు విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. ప్రస్తుతం దాయాది దేశంలో కిలో చికెన్ ధర రూ.437, పిండి రూ.135, గుడ్లు డజను రూ.275, దుంపలు కిలో రూ.78, పాలు లీటరు రూ.168, డీజిల్ లీటరు రూ.289, పెట్రోల్ లీటరు రూ.283గా కొనసాగుతున్నాయి.
ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పాక్ లో ద్రవ్యోల్బణం ప్రతి నెల కొత్త గరిష్ఠాలకు చేరుకుంటోంది. ఏప్రిల్ మాసంలో ఇది గరిష్ఠంగా 36.4 శాతానికి చేరుకుంది. ఇది ఆర్థికంగా దివాలా తీసిన శ్రీలంకలో ఉన్న ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ కావటం ఆందోళనలకు దారితీస్తోంది. ప్రస్తుతం పాక్ ఆసియాలో అత్యధిక ద్రవ్యోల్బణాన్ని కలిగి ఉన్నందున రోజురోజుకూ మరింతగా దిగజారుతోంది.
ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు IMF నుంచి బెయిల్ అవుట్ నిధులను పొందటం కోసం నానా తంటాలు పడుతోంది. ఐఎంఎఫ్ పెట్టిన అన్ని షరతులను పూర్తి చేసేందుకు యత్నిస్తోంది. తమకు 1.1 బిలియన్ డాలర్ల వాయిదా మెుత్తాన్ని విడుదల చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిరంతరం డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఈ నిధులను సకాలంలో పొందలేకపోతే పాక్ చేయాల్సిన చెల్లింపులు డిఫాల్ట్ అయ్యి దివాలా తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.