ఇండియా లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లో 1 బిలియన్ డాలర్లు (రూ 7,000 కోట్లు) పెట్టుబడిగా పెడతామని అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ వెల్లడించారు. ఆయా కంపెనీలు డిజిటల్ హంగులు అద్దుకునేందుకు సహకారం అందిస్తామని అయన ప్రకటించారు. అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రంలో భాగంగా భారత దేశం నుంచి 2025 నాటికి సుమారు 10 బిలియన్ డాలర్ల (రూ 70,000 కోట్లు) విలువైన ఎగుమతులను ప్రపంచ మార్కెట్ కు పరిచయం చేయనున్నట్లు చెప్పారు.
21వ శతాబ్దంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం ఐన భారత దేశం, ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా ల మధ్య మరింత పటిష్టమైన, మెరుగైన బంధాలు నెలకొంటాయని అభిప్రాయపడ్డారు. 'మీకోసం నేనొక ప్రిడిక్షన్ చేయబోతున్నా. 21 వ శతాబ్దం ఇండియా శతాబ్దం. ఈ దేశం చాలా స్పెషల్' అని జెఫ్ బెజోస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన ఇండియాలో అధికారిక పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూ ఢిల్లీ లో జరుగుతున్న అమెజాన్ ఇండియా సంభవ్ కార్యక్రమానికి అనుకోని అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

బాధపడేవాణ్ణి....
జెఫ్ బెజోస్ సంభవ్ కార్యక్రమానికి రావటం అనేది అధికారిక పర్యటనలో భాగం కాదని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ చెప్పారు. కానీ జెఫ్ మీటింగ్ ను అయన తన ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జెఫ్ బెజోస్ అక్కడి ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తన వ్యాపార ప్రస్థానాన్ని వారికి వివరించారు. 'నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు దానిని నేను ముందుకు తీసుకెళ్లక పోయి ఉంటె ఈ రోజు నేను తప్పనిసరిగా బాధపడేవాణ్ణి' అని జెఫ్ పేర్కొన్నారు. 'నేను ఊహించినదానికంటే ఎక్కువగా ఈ 25 ఏళ్ళ లో అమెజాన్ అభివృద్ధి చెందింద'ని చెప్పారు. 1994 లో అమెరికా లో ఒక చిన్న షెడ్డులో జెఫ్ బెజోస్ అమెజాన్ కు పురుడు పోసిన విషయం తెలిసిందే.

ముకేశ్ అంబానీ, రానా టాటా లతో భేటీ..
ప్రపంచ మహా కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్.. తన అధికారిక పర్యనటలో భాగంగా ఇండియా లో పలువురు ప్రముఖలను కలవనున్నారు. ఇందులో భాగంగా భారత అపర కుబేరుడు ఐన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తో పాటు, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తో భేటీ కానున్నారు. మరోవైపు కొంత మంది సెలెబ్రిటీలను కూడా కలవబోతున్నారు. షారుఖ్ ఖాన్ తో కూడా జెఫ్ సమావేశమవుతారని తెలిసింది. ప్రధాని నరేంద్ర మోడీ తో కూడా అధికారిక సమావేశం ఉంటుందని సమాచారం.

చిన్న వ్యాపారులకు దన్ను...
ఇప్పటి వరకు దేశంలో కేవలం వినియోగదారుల దృష్టిని ఆకర్షించిన అమెజాన్... ఇకపై దేశంలోని చిన్న వ్యాపారులను కూడా తన వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలే సెల్లర్స్ కు సంబంధించి అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో ఒకటి సరుకులు క్రెడిట్ పై అందించటం. అమెజాన్ లో రిజిస్టర్ ఐన సెల్లర్ల కు 45 రోజుల క్రెడిట్ ఫెసిలిటీ తో సరుకులను అందించే ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఇలాంటి చిన్న వ్యాపారులకు అవసరమైన టెక్నాలజీ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా ... అమెజాన్, ఫ్లిప్కార్ట్ రాకతో దేశంలో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆఫ్ లైన్ రిటైల్ వర్తకులు వాటిపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము వర్తకులకు వ్యతిరేకం కాదని నిరూపించుకోవటం కూడా అమెజాన్ వంటి కంపెనీలకు అవసరం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications