అమరావతి vs మావిగన్.. ఏపీ ఎకానమీకి ఏది లాభం.. రియల్ ఎస్టేట్ నుంచి ఐటీ పెట్టుబడుల వరకు ప్రభావమెంత..
అమరావతి vs మావిగన్ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భవిష్యత్తు ఏ వైపు సాగనుందనే ప్రశ్న కేవలం రాజకీయ వర్గాలనే కాదు.. దేశవ్యాప్త పారిశ్రామిక, కార్పొరేట్ రంగానికి కూడా అత్యంత కీలకమైన అంశంగా నేడు మారింది. ఆంధ్ర రాష్ట్రంలో అధికార మార్పిడిలు జరిగిన ప్రతిసారీ.. రాజధాని నమూనాలు మారుతుండటంతో, పెట్టుబడిదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
ఒకవైపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన గ్లోబల్ గ్రీన్ఫీల్డ్ నగరం అమరావతి బ్లూప్రింట్, మరోవైపు ఒకవేళ మాజీ సీఎం మా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే అమల్లోకి వచ్చే మావిగన్ (మంగళగిరి-విజయవాడ-గుంటూరు) సహజసిద్ధ అర్బన్ క్లస్టర్ వ్యూహం మధ్య ఏపీ భవిష్యత్ నిలబడి ఉంది. ఈ రెండు భిన్నమైన ఆర్థిక ఆలోచనల చుట్టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ రూపురేఖలు ఎలా మారుతాయో విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి యాంగిల్ను గమనిస్తే.. ఇది పూర్తిగా ఒక లార్జర్-దెన్-లైఫ్ క్యాపిటల్ సిటీ మోడల్. గతంలో హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన సుదీర్ఘ అనుభవంతో, శూన్యం నుండి ఒక అంతర్జాతీయ స్థాయి మెగా సిటీని సృష్టించాలనేది ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. తొమ్మిది థీమ్ సిటీలు, గ్లోబల్ ఐటీ కారిడార్లు, స్టార్టప్ జోన్లు, ఐకానిక్ ప్రభుత్వ భవనాలతో కూడిన ఒక కేంద్రీకృత రాజధానిని ఆయన ప్రపంచానికి పరిచయం చేయాలని సంకల్పంగా పెట్టుకున్నారు.
ఈ మోడల్ సింగపూర్ వంటి దేశాల భాగస్వామ్యాన్ని, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలను (FIIs) ఆకర్షించి, ఏపీకి ఒక బలమైన గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ను తెచ్చిపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజధాని భూసేకరణ ద్వారా చేతికి వచ్చిన వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ భారీ పారిశ్రామిక ప్రాజెక్టులకు ఎంతో అనుకూలమైనదిగా మారనుంది. అయితే ఇంతటి భారీ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చాలంటే చాలా సవాళ్లే మిగిలున్నాయి. లైవ్ లోకి రావాలంటే దశాబ్దాల సమయం, లక్షల కోట్ల ప్రజాధనం, అంతకంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ నిధుల మద్దతు అవసరం కావడం వ్యాపార వర్గాల ముందున్న అతిపెద్ద ప్రాక్టికల్ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు.
దీనికి పూర్తిగా భిన్నంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల్లోని మావిగన్ (MaViGun) వ్యూహాన్ని చెప్పుకోవచ్చు. ఒకవేళ మళ్లీ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆయన గతంలో ప్రతిపాదించిన వికేంద్రీకరణ (మూడు రాజధానుల) విధానాన్నే మరోసారి గట్టిగా అమలు చేసే అవకాశం ఉంది. ఈ విధానంలో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారినప్పటికీ.. కృష్ణా-గుంటూరు జిల్లాల పరిధిలోని మంగళగిరి-విజయవాడ-గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని ఒక సహజసిద్ధమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా విస్తరించాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
జీరో నుండి వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా అమరావతి మహానగరాన్ని నిర్మించడం కంటే.. ఇప్పటికే ఉనికిలో ఉన్న ఈ మూడు నగరాల మౌలిక వసతులను వాడుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో కూడిన వేగవంతమైన మార్గమని ఆయన భావిస్తున్నారు. దుర్గమ్మ వెలసిన విజయవాడలోని సుసంపన్నమైన రవాణా-లాజిస్టిక్స్ రంగాన్ని, గుంటూరులోని శతాబ్దాల నాటి వాణిజ్య పునాది రాళ్లను, మంగళగిరిలో అప్పటికే సిద్ధంగా ఉన్న ఐటీ పార్కులను తక్షణమే వినియోగించుకోవడం జగన్ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఐటీ, సేవా రంగాలు కూడా కొత్తగా నిర్మించే జీరో ప్రాంతాల కంటే, మంగళగిరి లాంటి తక్షణ వసతులున్న నగరాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతాయనేది ఈ యాంగిల్కు ఉన్న ప్రధాన బలంగా కనిపిస్తోంది.
ఏపీ రాజధానిపై ఈ రెండు విభిన్నమైన బిజినెస్ మోడళ్ల మధ్య ఉన్న వ్యత్యాసాలే ఇప్పుడు కార్పొరేట్ రంగాన్ని తీవ్ర ఆలోచనలో పడేస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు అమరావతి విజన్ పూర్తి స్థాయిలో ముందుకు సాగితే.. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు అపారమైన అవకాశాలు లభిస్తాయి. అయితే దీనికి సుదీర్ఘ నిరీక్షణతో కూడిన సమయం అవసరమవుతుంది.
అదే సమయంలో జగన్ అధికారంలోకి వచ్చి మావిగన్ శైలిలో వనరుల ఆధునీకరణ వైపు మొగ్గు చూపితే.. స్థానిక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs), బ్యాంకింగ్ రంగం, మంగళగిరి ఐటీ జోన్లు తక్కువ సమయంలోనే స్థిరమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంది. అయితే దీనివల్ల అమరావతి గ్రీన్ఫీల్డ్ నగరం కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు, అక్కడ ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన డెవలపర్ల పరిస్థితి మళ్లీ అయోమయంలో పడే ప్రమాదం ఉంది.
ఏదైనా ఒక పెద్ద పరిశ్రమ లేదా అంతర్జాతీయ సంస్థ ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే ముందు పాలసీలలో స్థిరత్వాన్ని (Policy Consistency) మొదటి ప్రాధాన్యతగా చూస్తుంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధాని ముఖచిత్రం మారితే బ్యాంకులు ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వడానికి వెనుకాడే పరిస్థితి ఉంటుంది. కార్పొరేట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా నిలదొక్కుకోవాలంటే ఈ రెండు యాంగిల్స్ మధ్య ఒక సమతుల్యత (Balance) అనేది చాలా అవసరం.
చంద్రబాబు ప్రతిపాదించిన అంతర్జాతీయ బ్రాండ్ విలువ (అమరావతి విజన్), జగన్ ప్రాధాన్యతనిచ్చే సహజసిద్ధ ప్రాంతీయ ఆర్థిక వృద్ధి (మావిగన్ రియాలిటీ).. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఒకే సువిశాల మెగా ఎకనామిక్ జోన్గా ఈ ప్రాంతాన్ని ప్రకటించినప్పుడే ఏపీకి పెట్టుబడుల వరద పారుతుంది. రాబోయే రోజుల్లో ఈ రెండు భిన్న కోణాల మధ్య లభించే రాజకీయ, చట్టపరమైన స్పష్టతే వచ్చే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని, దాని భవిష్యత్తును అలాగే ఏపీ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించనుంది.


Click it and Unblock the Notifications
