మొబైల్ యూజర్లకు షాక్! ఇన్నాళ్లూ ఊరించి.. ఇప్పుడు చావుకబురు చల్లగా...
ఇన్నాళ్లూ అన్లిమిటెడ్ కాల్స్, రోజువారీ డేటా ఆఫర్లతో ఆకట్టుకున్న పలు టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్లు అకస్మాత్తుగా మొబైల్ వినియోగదారులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. రిలయన్స్ జియో అరంగేట్రంతో పోటీని తట్టుకునే వ్యూహాల్లో భాగంగా తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తూ వచ్చిన ఇవి.. ఉన్నట్లుండి తమ పంథాను మార్చుకున్నాయి.
ఇన్కమింగ్ కాల్ రింగింగ్ సమయాన్ని తగ్గించడం మొదలుకొని, ఇంటర్ కనెక్టివిటీ యూసేజ్ చార్జీల వసూలు వరకు వచ్చిన టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్లు తాజాగా మరో అడుగు ముందుకేసి.. కాల్స్, డేటా చార్జీలు కూడా పెంచేశాయి. ఈ విషయమై ఇప్పటికే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఒక నిర్ణయానికి రాగా, తాజాగా రిలయన్స్ జియో కూడా చార్జీలు పెంచక తప్పదంటూ తన యూజర్లకూ షాక్ ఇవ్వడం.. సంచలనం సృష్టిస్తోంది. అసలే నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చార్జీల పెంపు బాటలో పయనించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
‘టారిఫ్ వార్'తో మొదలై...
మనిషికి తింటానికి తిండి లేకపోయినా.. మాట్లాడుకోవడానికి సెల్ఫోన్ మాత్రం తప్పనిసరి. అదీ నేటి పరిస్థితి. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక పరిస్థితి ఇంకా మారిపోయింది. రోజంతా ఆన్లైన్లోనే కాలక్షేపం. గంటల కొద్దీ మాట్లాడుకోవడం, వందల కొద్దీ మెసేజ్లు పంపుకోవడం, ఎడాపెడా ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఆడియో, వీడియో డౌన్లోడ్లు. దీనికంతటికీ కారణం 3జీ, 4జీ నెట్వర్క్లు అందుబాటులోకి రావడమే కాక అతి తక్కువ ధరకే కాల్, డేటా సేవలు కూడా లభించడం.
రిలయన్స్ జియో రాకతో...
చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విడదీసినట్లుగా.. టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో అరంగేట్రంతో.. జియోకు పూర్వం, జియో తరువాత అన్న చందంగా.. పరిస్థితి మారిపోయింది. అరంగేట్రంతోనే జియో టారిఫ్ వార్ మొదలుపెట్టడంతో అప్పటికే ఈ రంగంలో ఉన్న ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి నెట్వర్క్ ప్రొవైడర్లకు కూడా కాల్, డేటా చార్జీలు తగ్గించక తప్పలేదు. దీంతో ఇంటర్నెట్ విప్లవం మొదలైంది. జియో పోటీని తట్టుకునేందుకు దాని ప్రత్యర్థి కంపెనీలు కూడా చౌక ధరలకే కాల్, డేటా సేవలు అందించాల్సి వచ్చింది.
రేసులో పోటీ పడి.. ఆర్థికంగా కుదేలై...
టెలికాం రంగంలో పోటీని తట్టుకునే క్రమంలో అత్యంత చౌక ధరలకే కాల్, డేటా సేవలు అందించి కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకున్నప్పటికీ.. ఈ రేసులో టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్లు ఆర్థికంగా కుదేలవ్వాల్సి వచ్చింది. ఐడియా సొంతగా మనుగడ సాగించలేక వొడాఫోన్లో విలీనమైపోయింది. టాటా టెలీ సర్వీసెస్ ఎయిర్టెల్లో కలిసిపోగా.. ఆర్కామ్ దివాలా తీసింది. ఇక ఎయిర్సెల్, యూనినార్ వంటి నెట్వర్క్లు మొదట బాగానే ఉన్నా.. క్రమేణా నష్టాల్లో కూరుకుపోయి చివరికి సోదిలోకి రాకుండా పోయాయి.
సంక్షోభంలో టెలికాం పరిశ్రమ...
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు స్పెక్ట్రమ్ చార్జీల రూపంలో రూ.40 వేల కోట్లు, లైసెన్సు ఫీజుల కింద రూ.39 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటికి అదనంగా సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం... అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) బకాయిల కింద కేంద్రానికి రూ.93 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. పైగా ఏజీఆర్ బకాయిలు మూడు నెలల్లోగా చెల్లించాలంటూ టెలికాం కంపెనీలను సుప్రీం ఆదేశించింది. దీంతో వొడాఫోన్ ఐడియా వంటి నెట్వర్క్ ప్రొవైడర్ల మనుగడే ప్రశ్నార్థకమైంది. ఎయిర్టెల్ కూడా భారీ నష్టాలు మూటగట్టుకుంది.
చార్జీల బాదుడు షురూ...
వేల కోట్ల రూపాయల నష్టాలను పూడ్చుకునే పనిలో భాగంగా.. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు కాల్, డేటా చార్జీలను పెంచనున్నట్లు ప్రకటించేశాయి. డిసెంబరు 1 నుంచి దీనికి సంబంధించిన కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తాయని ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. అయితే ఎంత మొత్తం పెంచుతారనే అంశాన్ని ఈ రెండు టెలికం దిగ్గజాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే ఇవి ఇప్పటికే కనీస ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అయినా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. దీంతో కాల్, డేటా చార్జీలు పెంచేందుకే నిర్ణయించాయి.
చార్జీల పెంపు బాటలో ‘జియో'...!
దేశ టెలికాం రంగంలోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చి, ‘ఉచిత' ఆఫర్లతో అదరగొట్టి.. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఖాతాదారులను సంపాదించుకున్నరిలయన్స్ జియో కూడా తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రత్యర్థి కంపెనీలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ మొబైల్ చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. మరికొన్ని వారాల్లో తాము కూడా టారిఫ్ ధరలను పెంచబోతున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే నాన్-జియో కాల్స్కు నిమిషానికి ఆరు పైసల చొప్పున జియో వసూలు చేస్తోంది. తాజాగా మొబైల్ చార్జీలు కూడా పెంచితే యూజర్ల జేబులకు చిల్లులు పడడం ఖాయం.
బీఎస్ఎన్ఎల్ కూడా ఇదే బాటలో...
మొబైల్ చార్జీలు పెంచడం ఖాయమంటూ ప్రైవేటు రంగ టెల్కోలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, జియో ప్రకటిస్తుంటే.. ఇక ఇప్పటికే నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఊరికే చూస్తూ ఊరుకుంటుందా? చార్జీల పెంపు విషయంలో అది కూడా వీటి బాటలోనే పయనిస్తుంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ కాల్స్, డేటా టారిఫ్ పెంపుపై అంతర్గతంగా సమాలోచనలు జరుపుతోంది. డిసెంబర్ 1 నుంచి వడ్డింపు తప్పదు. కాకపోతే ఏ మేరకు చార్జీలు పెంచాలా అనే విషయంలో కొంత అస్పష్టత నెలకొని ఉంది.. అంతే!