దూసుకుపోతున్న రాకేష్ జున్జున్వాలా Akasa Air.. ఏడాదిలోనే అలా ఇండిగోను అధిగమించి..
Akasa Air: దివంగత భారత స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేష్ జున్జున్వాలా డ్రీమ్ ప్రాజెక్ట్ ఆకాశ ఎయిర్. తక్కువ ఖర్చులో విమానయానం చేయాలనుకునే బడ్జెట్ ప్రయాణికుల కోసం దీనిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత విమానయాన రంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోనే సంస్థ తనదైన గుర్తింపును తెచ్చుకుంటోంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన ఫిబ్రవరి నెలవారీ గణాంకాల ప్రకారం.. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 3 శాతానికి చేరుకుంది. మార్చి చివరి నాటికి 18 ఎయిర్క్రాఫ్ట్లను చేర్చాలని భావించిన ఎయిర్లైన్ సంస్థ ప్రస్తుతం 19 విమానాలను కలిగి ఉంది. ప్రస్తుతం దేశీయ విమానయానంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో ఆగస్టు 4, 2006లో ప్రారంభం కాగా.. ఆకాశ ఆగస్టు 7, 2022లో కార్యకలాపాలను ప్రారంభించాయి. అప్పట్లో ఇండిగోలో స్టార్టప్ టీమ్లో భాగమై ఆదిత్య ఘోష్ ఇప్పుడు ఆకాశలో పనిచేస్తున్నారు.

కార్యకలాపాలు ప్రారంభించిన కొత్తలో తొలి ఏడాది ఇండిగో కేవలం 2.6 శాతం మార్కెట్ వాటాను సంపాదించుకోగలిగింది. తాజాగా ఆకాశ దానిని అధిగమించి మెుదటి ఏడాదిలోనే కస్టమర్లకు మరింతగా చేరువైందని గణాంకాలు చెబుతున్నాయి. ఇండిగో ప్రస్తుతం 75 కంటే ఎక్కువ దేశీయ గమ్యస్థానాలకు మరియు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 గమ్యస్థానాలకు తన విమానాలను నడుపుతోంది.
భారత విమానయాన రంగాన్ని మార్చి 2007 నుంచి ఒక్కసారి వెనక్కి తిరిగి గమనిస్తే.. ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాతో విలీనం చేయబడింది. ప్రస్తుతం ఈ సంస్థ తిరిగి తమ ఒరిజినల్ ఓనర్ అయిన టాటాల చేతికి తిరిగి చేరుకుంది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎయిర్ డెక్కన్తో విలీనం అయిన తర్వాత 2012లో పతనమైంది. జెట్ ఎయిర్వేస్ ఎయిర్ సహారాను కొనుగోలు చేసి 2019లో పతనమైంది. పారామౌంట్ కూడా పతనమైంది. ప్రస్తుతం మార్కెట్లో ఇండిగో, స్పైస్జెట్, గో FIRST, ఎయిర్ ఇండియాలు మాత్రమే నిలదొక్కుకున్నాయి.


Click it and Unblock the Notifications