Ajit pawar: ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా రికార్డు.. కానీ, తీరని ఆ ఒక్క కోరిక!
మహారాష్ట్ర రాజకీయాల్లో 'దాదా' గా పిలవబడే అజిత్ పవార్ (Ajit Pawar) ప్రస్థానం ఒక ప్రభంజనం. కానీ, ఆ ప్రభంజనం ఒక అసంపూర్ణ కలగానే మిగిలిపోవడం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆయన మరణించడంతో, దశాబ్దాల కాలంగా ఆయన కంటున్న 'ముఖ్యమంత్రి' కల నెరవేరకుండానే ముగిసిపోయింది. మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ఒక శక్తివంతమైన నాయకుడు, ఆరుసార్లు ఉపముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. అత్యున్నత పీఠాన్ని అధిరోహించలేకపోవడం ఒక చారిత్రక విషాదం. అసలు అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందంటే..
6 సార్లు డిప్యూటీ సీఎం.. 5 గురు ముఖ్యమంత్రులు
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అజిత్ పవార్ (Ajit Pawar) పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. ఆయన ఏకంగా ఆరు సార్లు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విలాస్రావ్ దేశ్ముఖ్, అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, ఉద్ధవ్ థాకరే, ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడణవీస్ వంటి ఐదుగురు వేర్వేరు ముఖ్యమంత్రుల వద్ద ఆయన డిప్యూటీగా పనిచేశారు.

2019లో దేవేంద్ర ఫడణవీస్ తో కలిసి రాత్రికి రాత్రే ప్రమాణ స్వీకారం చేసిన 80 గంటల ప్రభుత్వం నుంచి, 2023 లో ఎన్సీపీని చీల్చి మహాయుతిలో చేరడం వరకు.. ఆయన ప్రతి అడుగు ముఖ్యమంత్రి పీఠం లక్ష్యంగానే సాగింది. కానీ, విధి మాత్రం ఆయనను ఎప్పుడూ 'నెంబర్ 2' స్థానానికే పరిమితం చేసింది. చివరికి ఆ కల నెరవేరకుండానే ఆయన ప్రస్థానం ముగిసింది.
అడ్మినిస్ట్రేషన్లో కింగ్.. కానీ..
అజిత్ పవార్ (Ajit Pawar) కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఒక సమర్థవంతమైన పాలకుడు. ఆయన నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి వంటి కీలక పోర్ట్ఫోలియోలను నిర్వహించారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చూపే వేగం, బ్యూరోక్రసీపై ఆయనకున్న పట్టు అమోఘం.
సొంత నియోజకవర్గం బారామతిని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఆయన కృషి వెలకట్టలేనిది. తన బాబాయి శరద్ పవార్ నీడ నుంచి బయటకు వచ్చి, సొంత ముద్ర వేయాలని ఆయన ఎప్పుడూ తపించేవారు. "నేను ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను" అని ఆయన బహిరంగంగానే తన ఆకాంక్షను చాటుకున్నారు. అయితే, సొంత గడ్డపైనే ఆయన జీవితం విషాదాంతం కావడం గమనార్హం.
వ్యక్తిగత జీవితం.. వారసత్వం..
అజిత్ పవార్ కు భార్య సునేత్ర పవార్, ఇద్దరు కుమారులు జై పవార్, పార్థ్ పవార్ ఉన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదురైనా కుటుంబం ఆయనకు ఎప్పుడూ అండగా నిలిచింది. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపే చొరవ వల్ల క్యాడర్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది.
ఏది ఏమైనా మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. మహారాష్ట్ర ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన మరణం కేవలం ఒక కుటుంబానికో, పార్టీకో జరిగిన నష్టం కాదు.. ఒక దార్శనికత ఉన్న నాయకుడిని రాష్ట్రం కోల్పోయింది. ముఖ్యమంత్రి కావాలనే ఆయన చిరకాల వాంఛ తీరకపోయినా, మహారాష్ట్ర ప్రజల హృదయాల్లో ఆయన ఒక బలమైన ముద్ర వేశారు.


Click it and Unblock the Notifications


