Reliance Jioకి చుక్కలు చూపించే పనిలో Airtel.. 5G Plus సేవలతో దూకుడు
Airtel 5G: దేశంలోని టెలికాం రంగంలో వేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే పనిలో ఉంది. దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఎయిర్టెల్ చేతల్లో చూపిస్తోంది.

తగ్గేదే లే..
టెలికాం వ్యాపారం ప్రస్తుతం ధరల పోటీతో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ఇదే సమయంలో 5జీ సాంకేతికత విస్తరణకు కంపెనీలు భారీగా తమ నెట్వర్క్ ను అప్గ్రేడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎయిర్టెల్ తన 5జీ ప్లస్ సేవలను దేశంలోని కొత్తగా 125 నగరాలకు విస్తరించింది. దీంతో కంపెనీ దేశంలోని దాదాపు 265 నగరాలకు తన 5జీ సేవలను అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగానే భారతీ ఎయిర్టెల్ 125 నగరాల్లో తన అల్ట్రా-ఫాస్ట్ 5G సేవలను ప్రారంభించినట్లు సోమవారం ప్రకటించింది.

సీటీవో ప్రకటన..
తమ కస్టమర్లకు అత్యధిక నాణ్యత గల నెట్వర్క్, సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు ఎయిర్టెల్ CTO, రణదీప్ సెఖోన్ వెల్లడించారు. మార్చి 2024 నాటికి అన్ని పట్టణాలు, కీలకమైన గ్రామీణ ప్రాంతాలను కవర్ చేసేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎయిర్టెల్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆధారితమైన 5G ప్లస్ సేవలు హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మల్టిపుల్ చాటింగ్, ఇన్స్టంట్ ఫోటో అప్లోడ్ తో పాటు మరిన్ని సేవలకు సూపర్ఫాస్ట్ యాక్సెస్ను అందిస్తాయన్నారు.

దేశవ్యాప్తంగా..
ఎయిర్టెల్ ఇప్పుడు తన 5G సేవలను ఉత్తరాన ఉన్న జమ్మూ నుంచి దక్షిణ కొన అయిన కన్యాకుమారి వరకు ప్రతి ప్రధాన నగరంలో అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. గత నెలలో ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల్లో 5జీని ప్రారంభించింది. కోహిమా, దిమాపూర్, ఐజ్వాల్, గ్యాంగ్టక్, సిల్చార్, దిబ్రూగర్, టిన్సుకియాలో ఎయిర్టెల్ 5G ప్లస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇప్పటికే గౌహతి, షిల్లాంగ్, ఇంఫాల్, అగర్తల, ఇటానగర్లలో సేవలు ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications