ఎయిర్టెల్ యూజర్లకు షాక్! వివాదాల నడుమ ఆ ప్లాన్స్ బంద్.. కొత్తగా తెచ్చిన 'ఫాస్ట్ లేన్' ఏంటి?
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) తన పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం ఒక కీలకమైన మార్పు చేసింది. గత కొన్ని రోజులుగా దేశంలో తీవ్ర చర్చకు దారితీసిన 'ప్రియారిటీ పోస్ట్పెయిడ్' (Priority Postpaid) సర్వీస్ను కంపెనీ అధికారికంగా నిలిపివేసింది. అయితే ఈ ప్లాన్ను పూర్తిగా రద్దు చేయకుండా, దీని స్థానంలో 'ఫాస్ట్ లేన్' (Fast Lane) అనే కొత్త పేరుతో సర్వీసును రీబ్రాండ్ చేసింది.
నెట్ న్యూట్రాలిటీ (Net Neutrality) నిబంధనల ఉల్లంఘన జరుగుతోందనే ఆరోపణలు, ప్రభుత్వ రెగ్యులేటరీ సంస్థల నిఘా పెరగడంతో ఎయిర్టెల్ సైలెంట్గా తన వెబ్సైట్ నుండి 'ప్రియారిటీ' అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో 'ఫాస్ట్ లేన్ టెక్నాలజీ'ని చేర్చింది. టెలికాం మార్కెట్లో ఈ మార్పు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.

అసలేంటి ఈ వివాదం? ప్రీపెయిడ్ యూజర్లకు నష్టమా?
ఎయిర్టెల్ గత మే 19న ఈ ప్రియారిటీ ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ (Airtel postpaid) ప్లాన్స్ను లాంచ్ చేసింది. ఎక్కువ డబ్బులు చెల్లించే పోస్ట్పెయిడ్ కస్టమర్లకు, నెట్వర్క్ రద్దీ (Traffic) ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా హై-స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తామని కంపెనీ ప్రామిస్ చేసింది. దీనికోసం '5G నెట్వర్క్ స్లైసింగ్' (Network Slicing) అనే టెక్నాలజీని వాడుకుంటోంది. అంటే టోటల్ నెట్వర్క్లో ఒక ప్రత్యేక భాగాన్ని కేవలం పోస్ట్పెయిడ్ యూజర్ల కోసమే కేటాయిస్తారన్నమాట.
అయితే, దీనిపై పార్లమెంటరీ కమిటీతో పాటు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్కువ డబ్బులు ఇచ్చే వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తే.. దేశంలో కోట్లాది మంది ఉన్న తక్కువ బడ్జెట్ ప్రీపెయిడ్ కస్టమర్ల ఇంటర్నెట్ స్పీడ్ పడిపోతుందని, ఇది 'నెట్ న్యూట్రాలిటీ' నియమాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ అనేది అందరికీ సమానంగా అందాలనేదే నెట్ న్యూట్రాలిటీ ముఖ్య ఉద్దేశం.
ఎయిర్టెల్ వివరణ ఏంటి?
ఈ వివాదంపై ఎయిర్టెల్ ప్రతినిధి స్పందిస్తూ.. తాము ప్లాన్స్ను వెనక్కి తీసుకోలేదని, కేవలం పేరు మాత్రమే మార్చామని క్లారిటీ ఇచ్చారు. 5G స్లైసింగ్ టెక్నాలజీ వల్ల కేవలం పోస్ట్పెయిడ్ యూజర్లకే కాకుండా నెట్వర్క్ సామర్థ్యం పెరిగి ప్రీపెయిడ్ యూజర్లకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ లభిస్తుందని వాదించారు. ఈ డేటాను టెలికాం రెగ్యులేటర్ 'ట్రాయ్' (TRAI) కి కూడా సమర్పించినట్లు తెలిపారు.
మరోవైపు, కాంపిటీటర్ కంపెనీ 'వోడాఫోన్ ఐడియా' (Vi) సోషల్ మీడియాలో ఎయిర్టెల్ను టార్గెట్ చేస్తూ.. "మా నెట్వర్క్లో అందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది, అందరూ మాకు సమానమే" అంటూ యాడ్స్ ఇచ్చింది. ఈ పోటీని తట్టుకోవడానికి , ప్రభుత్వ నోటీసుల నుండి తప్పించుకోవడానికి ఎయిర్టెల్ తన టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చాల్సి వచ్చింది. ఇదివరకు వెబ్సైట్లో ఉన్న "రద్దీ సమయాల్లో పోస్ట్పెయిడ్ వాళ్లకు ఫస్ట్ ప్రెఫరెన్స్" అనే లైన్లను ఇప్పుడు పూర్తిగా తొలగించారు.
ఎయిర్టెల్ పేరు మార్చినప్పటికీ, బ్యాక్గ్రౌండ్లో ఎయిర్ టెల్ వినియోగదారులకు 5G స్లైసింగ్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ అందుతూనే ఉంటుంది. అయితే, పార్లమెంటరీ ప్యానెల్ రాబోయే రోజుల్లో దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో, ప్రీపెయిడ్ యూజర్ల హక్కులను ఎలా కాపాడుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications